Tuesday, April 30, 2024

Big story | కౌలు రైతులకు ప్రభుత్వం పెద్దపీట.. సాగు హక్కు పాత్రల అందజేత

అమరావతి, ఆంధ్రప్రభ : రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలను కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. పంట సాగుదారు హక్కు చట్టం-2019 ద్వారా రైతులతో సమానంగా సంక్షేమ పథకాలు, రాయితీలు అందిస్తోంది. ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కౌలు రైతులకు సైతం కొండంత అండగా నిలుస్తోంది.

రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలను కౌలు రైతులకు కూడా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో భూమి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారునికి నిర్ణీత కాల వ్యవధిలో పండిన పంటలపై మాత్రమే హక్కు కల్పిస్తూ ‘పంట సాగుదారు హక్కు చట్టం-2019’ను తీసుకువచ్చింది. సీఎం జగన్‌ తీసుకువచ్చిన ఈ చట్టం కౌలు రైతుల పాలిట వరంగా మారింది.

చట్టం కల్పించిన భరోసాతో భూ యజమానులు కౌలుకు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందనే విమర్శలున్నాయి. కంటి తుడుపుగా గ్రామంలో తమ అనుయాయులకు ఒకరిద్దరికి కౌలుకార్డులు మంజూరు చేసి మమ అనిపించారనే ఆరోణలున్నాయి. అయితే వైకాపా ప్రభుత్వం అధకారంలోకి వచ్చాక కౌలు రైతుల దశ మారింది. భూమి లేని సన్న చిన్నకారు నిరుపేద రైతులకు, దేవదాయ భూములు సాగు చేసుకునే రైతులకు సైతం పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేసి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

- Advertisement -

ఈ మేరకు రైతు భరోసా కేంద్రాల్లో కౌలు రైతు గుర్తింపు గ్రామ సభలను నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన కౌలుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాన్ని అందజేశారు. దీంతో రాష్ట్రంలో ఏ ఈ ఏడాది అత్యధికంగా 7.7 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

పంట సాగుదారు పత్రంతో ఇవీ ప్రయోజనాలు

పంట సాగుదారు పత్రం పొందిన కౌలు రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడిగా సాయంగా రూ. 13,500 ప్రభుత్వం అందిస్తుంది. పంట నష్ట పరిహారం, ఉచిత పంటల బీమా పథకం, సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. ఈ పత్రం ద్వారా బ్యాంక్‌ల్లో పంట రుణం పొందవచ్చు. పంట కొనుగోళ్లలో ప్రభుత్వం చెల్లించే కనీస మద్దతు ధర పొందవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు- రాయితీపై పొందేందుకు అర్హులు.

కౌలు రైతులకు వరంలా సీసీఆర్‌సీ కార్డులు 7.7 లక్షలు ఈ ఏడాది అత్యధికంగా మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను (సీసీఆర్‌సీ కార్డులు) అందించాం. భూమి యాజమాన్య హక్కులకు భంగం కలగకుండా కౌలుదారునికి నిర్ణీత కాల వ్యవధిలో పండిన పంటలపై మాత్రమే హక్కు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘పంట సాగుదారు హక్కు చట్టం-2019’తో భూ యజమానులు కౌలుకు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకువస్తున్నారు. రైతులతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు వర్తింపజేస్తున్నారు.

ఈ కార్డు ఆధారంగా బ్యాంకుల్లో పంట రుణాలు సైతం మంజూరు చేస్తున్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంది.ఇదిలా వుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త తెలిపింది. సెప్టెంబర్‌ నెలలో అనగా వచ్చే నెలలో కౌలు రైతుల బ్యాంకు అకౌంట్స్‌లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 7.7 లక్షల మంది కౌలు రైతులు ప్రయోజనం పొందనున్నారు. 7.7 లక్షల మంది కౌలు రైతులకు ఇప్పటికే కార్డులను కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువు తేదీ అయిన ఆగష్టు 17 నాటికి మొత్తం 7.7 లక్షల మంది కౌలు రైతులు రైతు భరోసా పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నారు.

దీంతో వారందరికీ రైతు భరోసా కేంద్రాల ద్వారా కార్డులను జారీ చేయడం జరిగింది. ఈ కార్డులను పొందిన కౌలు రైతులు వచ్చే నెలలో మొదటి విడత రైతు భరోసా డబ్బులను పొందనున్నారు. దీనికి తోడు ఈ ఏడాది కౌలు రైతులకు రూ. 4000 కోట్ల పంట రుణాలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు పంట రుణాలతో పాటు ప్రభుత్వం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలను వారికి కూడా అందేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా 2019 సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కౌలు రైతులకు పంట రుణాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

గత నాలుగు సంవత్సరాలలో మొత్తం రూ. 6684 కోట్ల పంట రుణాలను అర్హులైన 9 లక్షల మంది కౌలు రైతులకు అందించడం జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 3.92 కోట్ల మంది కౌలు రైతులకు రైతు భరోసా కింద రూ. 529 కోట్లను అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. మరొకవైపు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఈ క్రాప్‌ బుకింగ్‌ అనే వ్యవస్థను ప్రారంభించింది.

రైతులు తాము పండించిన పంటను ఈ క్రాప్‌ చేసుకోవడానికి వ్యవసాయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రైతులు తమ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఈ క్రాప్‌ను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ క్రాప్‌ చేసుకున్న రైతులకే ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారులు ఏర్పాటు- చేస్తున్నారు. కావున ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పొందాలనుకునే రైతులు వెంటనే ఈ క్రాప్‌ కోసం నమోదు చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement