Saturday, May 4, 2024

TS | కీచ‌క టీచ‌ర్.. మైన‌ర్ బాలిక‌ల‌పై ఏడాదిగా అత్యాచారం

యాదాద్రి భువ‌న‌గిరి : అన్నెంపున్నెం ఎరుగ‌ని ఆరుగురు బాలికలు ఓ టీచ‌ర్ చేతిలో బ‌ల‌య్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచ‌ర్ కీచ‌కుడిగా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఓ బాలిక ఇటీవ‌ల అనారోగ్యానికి గుర‌వ‌డంతో ఆ కీచ‌క టీచర్ అఘాయిత్యం బయటపడింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో అండెం మాధ‌వ‌రెడ్డి ఉపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నాడు. అయితే త‌న కోరిక‌ల‌ను తీర్చుకునేందుకు మూడో త‌ర‌గ‌తి చ‌ద‌వుతున్న బాలిక‌ల‌కు చాక్లెట్లు, పైస‌లు ఆశ చూపి వారి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించేవాడు. తాక‌రాని చోట తాకి మ‌రింత నీచానికి దిగ‌జారాడు. ఇటీవ‌లే ఓ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ పాప త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. టీచ‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు త‌ల్లిదండ్రుల‌కు చెబితే, కొట్టి చంపేస్తాన‌ని బెదిరించేవాడ‌ని ఆ చిన్నారి వాపోయింది.

టీచర్ ఏడాది కాలంగా త‌మ‌పై చేస్తున్న దారుణాల‌ను బాధిత బాలిక‌లంద‌రూ ఒక్కొక్కటిగా చెప్పారు. ఆగ్ర‌హాంతో ఊగిపోయిన‌ తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లగా అప్పటికే టీచర్ వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. టీచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు చేశారు. పోలీసులు టీచర్ మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement