Saturday, May 4, 2024

మాచర్ల హింసలో బాధితులకు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : మాచర్లలో వైసిపి గూండాల చేతిలో దాడికి గురైన టిడిపి నేతలు, కార్యకర్తలను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్ లో పరామర్శించారు. దాడిలో గాయపడిన, ఆస్తులు నష్టపోయిన పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ప్రతి ఒక్క బాధితునితో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డాడీ ఘటన, పోలీసుల అండతో తమపై, ఇళ్లపై జరిగిన దాడులను బాధితులు వివరించారు. ఇళ్లు, కార్లు ధ్వంసం చేసిన విధానాన్ని వివరించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి దైర్యం చెప్పారు. ఇంట్లో వస్తువులు, కార్లు ధ్వంసం చేసిన కారణంగా నష్టపోయిన కుటుంబాలను పార్టీ ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

దాడులతో తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత వర్గంపైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టిన విధానాన్ని జిల్లా నేతలు అధినేత కు వివరించారు. 24 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబుకు తెలిపారు. కేసుల విషయం కూడా పార్టీ చూసుకుంటుందని,చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కేవలం పార్టీ నేతలను అక్రమ కేసుల నుంచి బయట పడేయటమే కాకుండా కారకులపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చంద్రబాబు వివరించారు. మాచర్ల ఘటన ముమ్మాటికి ప్రభుత్వ హింసే అని, ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులకు జిల్లా ఎస్పీ సహకరించారని చంద్రబాబు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement