Saturday, April 27, 2024

నంద్యాల ఘటనపై అధ్యయన కమిటీ : అచ్చెన్నాయుడు

నంద్యాల ఘటనపై టీడీపీ సీనియర్ నేతలతో అధ్యయన కమిటీ వేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువనేత నారాలోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర మహా యజ్ఞంలా సాగుతోందన్నారు. ఆ సమయంలో నిన్న నంద్యాలలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. జరిగిన సంఘటనపై కూలంకషంగా అద్యయనం చేసి, పూర్తి నివేదిక అందించేలా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీలోని సభ్యులు ఘటనపై సమగ్రంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి నంద్యాల మండలం, కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి .. అఖిల ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement