Monday, May 6, 2024

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఆపండి.. నేషనల్ మెడికల్ కమిషన్‌కు విద్యార్థి జేఏసీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిలుపుదల చేసి ఆ విద్యాసంస్థ పేరు ప్రతిష్టలను కాపాడవలసినదిగా ఆలిండియా విద్యార్థి, యువజన జేఏసీ జాతీయ ఛైర్మన్ నగరపు ప్రసాద్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన గురువారం న్యూఢిల్లీలో నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… యూనివర్సిటీ పేరు మార్పుపై విద్యార్థులకు సమాచారమివ్వడం, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వంటివేవీ జరగలేదని చెప్పుకొచ్చారు. పేరు మార్చడం వల్ల నాలుగు దశాబ్దాలుగా ఉన్న విద్యాసంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని అన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే ప్రప్రథమంగా 1986లో అన్ని మెడికల్ కాలేజీలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కిందికి తీసుకొచ్చారని ప్రసాద్‌రావు  వివరించారు. నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకోవడమే కాక, వైద్య విద్యార్థులు, పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement