Sunday, May 19, 2024

సోనూసూద్‌కు కోపం.. డాక్టర్లకు సూటి ప్రశ్న

దేశవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ ఎంతోమందికి సాయం అందిస్తున్నాడు. అతడు చేస్తున్న ప్రజాసేవ కారణంగా ప్రధాని లాంటి వారికి కూడా రాని క్రేజ్ అతడి సొంతమైంది. ముఖ్యంగా సాయం చేయండి అని ఎవరైనా అడిగితే చాలు.. నేనున్నాను అంటూ సోనూసూద్ ముందుకు వస్తున్నాడు. దీంతో సోనూ సూద్‌ను ఆశ్రయించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ ప్రజలను ఉక్కిరిబిక్కిర చేస్తోంది. దీంతో వాటికి సంబంధించిన ఇంజెక్షన్‌ల కోసం సోషల్ మీడియా వేదికగా చాలామంది సోనూను సహాయం అడుగుతున్నారు. తాజాగా విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని, ఆమెకు కవాల్సిన ఇంజెక్షన్ దొరకడం లేదంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తూ ఆదుకోవాలని కోరాడు. అయితే ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమే అయినా.. సోనూసూద్ పెద్ద మనసు చేసుకుని దాన్ని బాధితుడికి అందజేశాడు.

ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూకు ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. ఒక ఇంజెక్షన్ ఎక్కడా దొరకడం లేదని వైద్యులకు తెలిసినప్పుడు.. దాన్ని వైద్యులు ఎందుకు రికమండ్ చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా వైద్యులను సోనూ ప్రశ్నించాడు. పెద్ద పెద్ద ఆసుపత్రులకే దొరకని పరిస్థితి ఉంటే.. అది సామాన్యులకు ఎలా దొరుకుతుందని నిలదీశాడు. ఆ ఇంజెక్షన్ దొరకడం కష్టమని తెలిసిన తరువాత.. ప్రత్నామ్నాయాలను ఎందుకు చూడడం లేదో తనకు అర్థం కావడం లేదంటూ సోనూ ప్రశ్నించాడు. దీంతో సోనూకు లక్షల సంఖ్యలో నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. బ్లాక్ మార్కెట్ పెంచేందుకే వైద్యులు ఇలా చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వైద్యులు మాత్రం వేరే మార్గం లేక అవి సిఫార్సు చేయాల్సి వస్తోందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement