హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో భద్రత, రక్షణకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, యూనవర్సిటీల్లో సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్లబ్లు విద్యాశాఖ, పోలీసు విభాగాల పరిధిలో పనిచేస్తాయి. ఈ సేఫ్టీ క్లబ్లు లైంగికవేధింపులు, డ్రగ్స్, సైబర్ క్రైం, హాస్టల్ భద్రత, రవాణా భద్రత, ట్రాఫిక్, రహదారి భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, పోలీసు ఉన్నతాధికారులు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కలిసి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత చర్యలకు సంబంధించి రూపొందించాల్సిన మార్గదర్శకాలపై గురువారం సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలు ప్రతిపాదనకు వచ్చాయి. విద్యా సంస్థలు, చుట్టుపక్క ప్రదేశాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, కోచింగ్ సెంటర్లు తదితర ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టేందుకు, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైంను అంతమొందించేందుకు గాను ఘట్టి నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ధారించారు.
విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు విద్యార్థులకు అవగాహనను కల్పించడంతో పాటు డ్రగ్స్, గంజాయి తీసుకునే విద్యార్థులపై నిఘా పెట్టనున్నారు. అలాంటి విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. అందులో తల్లిదండ్రులు, అధ్యాపకులను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. విద్యార్థినులకు భద్రతను కల్పించేలా, సైబర్ క్రైమ్ను అరికట్టేలా ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు, మహిళా సెక్యూరిటీ సెల్, సైబర్ సెల్, కౌన్సెలింగ్ సిబ్బంది, మౌలికవసతులు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి సెమిస్టర్లో వీటిపైన ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు విద్యాశాఖ, పోలీసు శాఖలు కలిసి పనిచేయనున్నాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు.
ప్రస్తుతం ఉన్న చట్టాల్లో మార్పు!…
ప్రతి విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, డ్రగ్స్, సైబర్ క్రైం బారిన విద్యార్థులు పడకుండా ఉండేలా ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మార్పు చేసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి నూతన చట్టాన్ని తెచ్చేందుకు అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీలపై ఎప్పుడూ పోలీసుల నిఘా ఉండేలా చర్యలు తీసుకొబోతున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్, సైబర్ క్రైం, ర్యాగింగ్ పేరుతో యూనివర్సిటీల్లో పోలీసుల ప్రమేయం ఉండడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.