Sunday, April 28, 2024

సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె, పట్టణ ప్రగతి : మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసిఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి అని, పల్లెలు, పట్టణాలు బాగుచేసుకోవడనికి గొప్ప ప్రణాళిక రూపొందించిన‌ట్లు మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పై సన్నాహక సమావేశాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఆదర్శవంతమైనా కార్యక్రమం లేద‌న్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామ, పట్టణాలకు నిధులు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వ‌మే అని, ఇట్లా అదనపు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జూన్ 3 నుంచి 18 వరకు 4వ విడత పల్లె ప్రగతి, 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జరగనుంద‌న్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇందులో ప్రధాన భూమిక పోషించాల‌న్నారు. కేసీఆర్ ముందు చూపు వల్ల తెలంగాణలో ఈ ఏడాది వరకు 7.5 శాతం పచ్చదనం పెరిగింద‌ని, దేశంలో ఎక్కడా గ్రీనరీ ఇంతలా పెరగలేద‌న్నారు. మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు తో పాటు అవెన్యూ ప్లాంటేషన్ పెంచాల‌న్నారు. జూన్3వ తేది లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు సందర్శించి వాటి పనితీరు పరిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంతు షిండే, జడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభారాజు, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్,అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే పలువురు అధికారులు,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement