Sunday, May 19, 2024

అమరుల పేర్లు పలికే అర్హత కూడా రేవంత్ రెడ్డికి లేదు : TSREDC ఛైర్మన్ వై.సతీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమరవీరుల పేర్లను.. ఉద్యమద్రోహి, తెలంగాణ ద్రోహి అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పలకడం వారిని అవమానించడమేనని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. శ్రీకాంతచారి, యాదిరెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుకు కదిలారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలుగుదేశంలో పార్టీలో ఉంటూ.. చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేస్తూ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచాడన్నారు. రెండు కళ్ల సిద్ధాంతమంటూ యువతను రెచ్చగొట్టిన చంద్రబాబు సంకలో దూరి.. తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలకు కారణమయ్యాడన్నారు. అలాంటోడు ఇవాళ వచ్చి తెలంగాణ కోసం తాను ఏదో చేసినట్టుగా ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నాడన్నారు. వాళ్ల పేర్లు పలికే అర్హత కూడా నీకు లేదని, వాళ్ల కాళ్ల గోటికి కూడా నువ్ సరిపోవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను వెన్నంటి ఉంది కాబట్టే నేడు కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు ఎంబీబీఎస్ చదివగలిగిందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లోనే డాక్టర్ గా ఉద్యోగం కూడా చేస్తోందన్నారు. అమరుల త్యాగాలకు నివాళిగా అత్యద్భుతమైన స్మారకాన్ని నగరం నడిబొడ్డున నిర్మించుకోగలిగిందన్నారు. కానీ ఉద్యమద్రోహివి, ఉద్యమ కారులపైకి తుపాకి పట్టుకుని ఉరికినోడివి, పదవుల కోసం పాకులాడి ఉద్యమాన్ని విస్మరించినోడివి.. నీకు ఇవన్నీ ఎలా కనిపిస్తాయి ? అని ప్రశ్నించారు.

నీకు రాష్ట్రం అంటే పట్టింపు లేదు. కేవలం రాజకీయాలు.. నిన్ను తెరవెనుక నుంచి నడిపిస్తున్న వారి ఆదేశాలు అమలు చేయడం మాత్రమే నీకు తెలుసని అన్నారు. అందుకే రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి పార్లమెంట్ లో మాట్లాడవన్నారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని పట్టించుకోవన్నారు. ఆనాడు ఉద్యమాన్ని అడ్డుకుని వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకులైన వారిలో నువ్వు ముఖ్యుడివన్నారు. ఇప్పుడు అదే రీతిలో అభివృద్ధిని అడ్డుకుంటున్నావన్నారు. ఎన్నికలు దగ్గరపడున్న వేళ.. ఆనాడు ఉద్యమానికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పనులు ఎక్కడ బయట పడతాయోనని.. ఇష్యూను డైవర్ట్ చేయడానికి సర్కారు మీద, సీఎం మీద, మంత్రి కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నావన్నారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నువ్వు తెలంగాణకు చేసిన ద్రోహం ఎవ్వరూ మరిచిపోరన్నారు. ఇప్పుడు మరోసారి చేయాలనుకుంటున్న ద్రోహాన్ని అడ్డుకుని తీరుతారని సతీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement