Monday, April 29, 2024

ఇంకొద్దిసేప‌ట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌..

శ్రీహరికోట, ప్రభన్యూస్‌: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియ లిమిటెడ్‌ ద్వారా పూర్తి వాణిజ్య పరంగా నిర్వహించనున్న ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 3 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్ట నున్నారు. ఇస్రో విజయాశ్వంగా పిలువబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ -సీ53 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇప్పటికే వాహన అనుసంధాన భవనం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ను రెండవ ప్రయోగ వేదికపైకి శాస్త్రవేత్తలు చేరవేశారు. రాకెట్‌ రిహార్సల్‌ను నిర్వహించిన అనంతరం ఎంఆర్‌ఆర్‌ సమావేశాన్ని నిర్వహించి ప్రయోగానికి సంసిద్ధత వ్యక్తం చేసిన అనంతరం లాంచ్‌ ఆధరైజేషన్‌ బోర్డు ప్రయోగానికి పచ్చజెండా ఊపింది.

దీంతో నిన్న (బుధవారం) సాయంత్రం 4 గంటలకు షార్‌లో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. కౌంట్‌డౌన్‌ సమయంలోనే నాలుగు దశల రాకెట్లో 4, 2 దశల మోటార్లలో ద్రవ ఇంధనాన్ని నింపారు. అనంతరం 1, 3 దశల మోటార్లకు ఘన ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇంధనాన్ని నాలుగు దశలలో నింపిన అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల పని తీరును మరోసారి పరిశీలించనున్నారు. ప్రయోగానికి సుమారు 30 నిమిషాల ముందు రాకెట్‌ను సూపర్‌ కంప్యూటర్‌ ఆధీనంలోకి తీసుకువెళ్లనున్నారు శాస్త్రవేత్తలు. సూపర్‌ కంప్యూటర్‌ ఆదేశాలతో కౌంట్‌డౌన్‌ 0కు చేరుకోగానే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగికెక్కుపెట్టిన బాణంలా రోదసిలోకి దూసుకెళ్లనుంది.

రాకెట్‌ ప్రయోగానికి పటిష్ట బందోబస్తు..

శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి నేడు రాకెట్‌ ప్రయోగం జరుగనున్న పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు బలగాలు భారీగా షార్‌కు చేరుకున్నాయి. పటిష్ట బందోబస్తు నడుమ పీఎస్‌ఎల్‌వీ -సీ53 ప్రయోగం జరుగనుంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక బలగాలు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. గతంలో రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులను షార్‌ కేంద్రంలోకి అనుతించే వారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో షార్‌లోకి సందర్శకులను గత రెండేళ్లుగా అనుమతించిన అధికారులు ఈ రోజు జరగనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ53 ప్రయోగాన్ని వీక్షించేందుకు అనుమతించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులు ప్రయోగాన్ని వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. దీంతోపాటుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రయోగాన్ని వీక్షించే ఏర్పాట్లను ఇస్రో అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 5.30గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌, దూరదర్శనల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement