Monday, May 20, 2024

సీట్లు ఫుల్‌.. ఫ్యాకల్టి నిల్‌! ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడాలేని ప్రొఫెసర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉన్న దాదాపు సగం వరకు ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టి కొరత వెంటాడుతోంది. కాలేజీల్లో సీట్లు ఫుల్‌గా ఉంటున్నాయి గానీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరైనా నిష్పత్తిలో ఫ్యాకల్టి ఉండడంలేదు. ఇంజనీరింగ్‌ సీట్లకు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు తరగతులు బోధించేందుకు కావాల్సిన ప్రొఫెసర్లను నియమించుకోవడంలేదనే విమర్శులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోందని పలు ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఒక్క ఫ్యాకల్టియే కాదు సరైనా ల్యాబ్‌లు, మౌలిక వసతులు ఉండడంలేదు. అటానమస్‌, నాన్‌ అటానమస్‌ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్లు ఉండడం లేదని తీవ్ర ఆరోపణలున్నాయి.

సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్‌పై ఉన్న ఆసక్తి ప్రొఫెసర్లను నియమించుకోవడంలో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నాన్‌ అటానమస్‌ కాలేజీలో దాదాపు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒకరు, అటానమస్‌ కాలేజీలో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ నిబంధనలను చాలా కాలేజీలు పాటించడంలేదని తెలుస్తోంది. బ్రాంచీలకు అనుగుణంగా ప్రొఫెసర్లు దొరకపోవడంతో ఉన్న ఫ్యాకల్టినే కొత్త కోర్సుల కోసం వినియోగించుకుంటున్నారు. సహాయ ఆచార్యుడిగా నియమించాలంటే బీటెక్‌, ఎంటెక్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ కావాల్సి ఉంటుంది.

- Advertisement -

కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌కు విద్యార్థుల్లో చాలా క్రేజ్‌ ఉంది. దీనికి అనుబంధ కోర్సులైన (ఎమర్జింగ్‌ కోర్సులు) సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, డాటా సైన్స్‌, ఐవోటీ, సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల సీట్లను చాలా కాలేజీలు మార్చుకున్నాయి. అయితే సీట్లు, కోర్సులు మార్చుకున్న కాలేజీలు మాత్రం ప్రొఫెసర్లను నియమించుకోవడంపై ఏమాత్రం దృష్టా సారించడంలేదు. ఉన్న వారితోనే పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సారి దాదాపు 14,565 సీట్లకు అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది.

ఇందులో 6390 సీట్లను సీఎస్‌ఈలోకి మార్చుకుంటే, కొత్తగా 7635 సీట్లకు ప్రభుత్వం ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలో మొత్తం లక్షకు పైగా సీట్లు ఉన్నాయి. నాన్‌ సర్క్యూట్‌ బ్రాంచి అధ్యాపకులను కొత్త కోర్సుల కోసం ట్రైనింగ్‌ ఇప్పించి వారితోనే విద్యార్థులకు తరగతులు చెప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాంప్రదాయ కోర్సులైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ సీట్లను రద్దు చేసుకోవడంద్వారా ఆయా సబ్జెక్టులు బోధించే ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి.

కాలేజీలపై చర్యలేవీ..?

రాష్ట్రంలో మొత్తం సుమారు 170 కాలేజీలు ఉంటే అందులో దాదాపు 137 వరకు ప్రైవేట్‌ కాలేజీలే ఉన్నాయి. 2.60 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 14వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుంటే మిగిలి విద్యార్థులంతా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే చదువుతున్నారు. ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా దాదాపు 45 వేల మంది వరకు అధ్యాపకుల అవసరం ఉన్నట్లుగా ఓ అంచనా. కానీ ప్రస్తుతం పనిచేస్తుంది మాత్రం సుమారు 22 వేల మందే ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు తనిఖీలకు వచ్చినప్పడు మాత్రం కాగితాల్లో చూపించే లెక్కలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.

సీట్లు, కోర్సుల కన్వనర్షన్‌, పెంపుకు అనుమతులిచ్చే అధికారులు కాలేజీల్లో సరిపడా, అర్హత కలిగిన ఫ్యాకల్టి ఉన్నారా? లేదా? అనే దానిపై ఆరా సరిగా తీయడంలేదు. అటువంటి కళాశాలలకు కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దాంతో లక్షల ఫీజులు కట్టే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోంది. కొన్ని కాలేజీలు కళాశాలలో పనిచేయని అధ్యాపకులను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగితాల్లో మాత్రంమే అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా ఉంటారు గానీ, తరగతి గది బోధనలో మాత్రం వారు కనిపించరని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌ కుమార్‌ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement