Sunday, April 28, 2024

Priyanka Gandhi – అప్పుల ఊబిలో భార‌త్! ప‌దేళ్లలో రూ. 150 ల‌క్ష‌ల కోట్ల రుణం

ఈ సొమ్మంతా ఏంచేశారన్న కాంగ్రెస్​ నేత
మోదీని ప్రశ్నలతో నిల‌దీసిన ప్రియాంకా గాంధీ
మ‌ళ్లీ రూ 14 ల‌క్ష‌ల కోట్ల రుణం ఏంచేస్తారని మండిపాటు
ప్రతి ఒక్క భార‌తీయుడిపై ₹ ల‌క్ష‌న్న‌ర రుణ భారం
పెద్దలకు దోచిపెట్టి.. సామాన్యులపై అప్పుల భారం
67 ఏళ్లలో 55 లక్షల అప్పు ఉంటే.. ఈ పదేండ్లలో రూ. 205 లక్షల కోట్లకు చేరింది
ప్రధాని మోదీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్​

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వం ప‌దేళ్ల‌లో రూ 150 లక్షల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం రూ 14 లక్షల కోట్లకు పైగా రుణం తీసుకోబోతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంద‌ని, ఈ రుణంతో ఏం చేయబోతున్నారని ప్రియాంక అడిగారు.

67ఏళ్ల‌లో రుణ భారం కేవ‌లం 55 ల‌క్ష‌ల కోట్లు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు ₹ 55 లక్షల కోట్లు ఉందన్నారు. గత 10 ఏళ్లలో మోదీ ఒక్కడే దాన్ని ₹ 205 లక్షల కోట్లకు పెంచారని ప్రియాంక మండిపడ్డారు.. ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు చేశారని ప్రశ్నించారు. పెద్ద కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత డబ్బులు వెచ్చించారని ఆరోపించారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు ₹ 150 లక్షల కోట్ల రుణం తీసుకుందన్నారు. దీని ప్రకారం ఇప్పుడు దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున ₹ 1.5 లక్షల అప్పు ఉందని ప్రియాంక అన్నారు. అసల ఈ సొమ్మును దేనికోసం వినియోగించారంటూ మోదీకి ప్ర‌శ్న‌లు సంధించారు. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరిగిపోతుంటే సామాన్య ప్రజానీకానికి ఊరట లభించే బదులు.. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మరింత అప్పుల్లోకి తోసే యత్నం చేస్తుందంటూ ప్రియాంకా మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement