ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేస్తారు. రూ.1,115 కోట్ల వ్యయంతో ఉత్తరప్రదేశ్ అంతటా నిర్మించిన 16 అటల్ అవాసీయ విద్యాలయాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఒక రోజు పర్యటనలో భాగంగా కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
30 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన క్రికెట్ స్టేడియంకు దాదాపు మధ్యాహ్నం 1.30 గంటలకు మోడీ శంకుస్థాపన చేస్తారు.
మహా శివుడు స్ఫూర్తిగా చంద్రవంకను పోలిన పైకప్పులు, త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్లు, కాశీ ఘాట్ల వద్ద మెట్లను పోలిన సీట్లతో స్టేడియంను నిర్మించతలపెట్టారు. 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో స్టేడియంను నిర్మిస్తున్నారు. సాయంత్రం దాదాపు 3.15 గంటలకు రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవం ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
అదే సందర్భంగా పాఠశాలలను ప్రారంభిస్తారు. కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలతో కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం అటల్ ఆవాసీయ విద్యాలయాలను ఉత్తరప్రదేశ్ అంతటా నిర్మించారు. దాదాపు 10 నుంచి 15 ఎకరాల్లో నిర్మించిన ప్రతి పాఠశాలలోనూ తరగతి గదులు, క్రీడా మైదానం, వినోద కార్యక్రమాలకు స్థలం, ఒక మినీ ఆడిటోరియం ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.