75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిగా నరేంద్ర మోదీ 8వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశ ప్రజలకు స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విభజన గాయాలు నేటికి వెంటాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యసిబ్బందిని ప్రధాని మోదీ కొనియాడారు. అంతకు ముందు ఆయన రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అజయ్భట్ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. ఒలింపిక్స్లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ఒలింపిక్స్లో పతకాలు సాధించినవారు దేశానికే స్ఫూర్తి అంటూ అభినందించారు. ఇండియా బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించుకున్నారు.
కాగా అంతకుముందు ట్విట్టర్లో ప్రధాని మోదీ స్వాతంత్ర్చ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. ‘ దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య పర్వదినం ప్రతి ఒక్క భారతీయ పౌరుడిలో నూతన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని రగిలించాలని ఆకాంక్షిస్తున్నాను. జైహింద్’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.