Monday, April 29, 2024

లార్డ్స్ టెస్ట్: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల ఆధిక్యం

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 391 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ రూట్ భారీ సెంచరీ చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు. రోజంతా బ్యాటింగ్ చేసిన అతడు టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 321 బంతుల్లో 180 పరుగులు చేసి ద్విశతకానికి దగ్గరగా వచ్చాడు. అయితే సహచరులు అవుట్ కావడంతో ద్విశతకం పూర్తి చేయలేకపోయాడు.

రూట్ భారీ సెంచరీ ఫలితంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 391 పరుగులకు ఆలౌటై.. 27 పరుగుల కీలక ఆధిక్యం మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌ టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్రహం గూచ్‌ (8900)ను దాటిన రూట్‌ (9067).. మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ (12472) తర్వాత రెండో స్థానానికి చేరాడు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ 4, ఇషాంత్‌ శర్మ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. బూమ్రా తీవ్రంగా నిరాశపరిచాడు. అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. కాగా మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: స్టార్ అవుతాడనుకున్న క్రికెటర్ రిటైర్ అయ్యాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement