Monday, May 13, 2024

మోదీ బెంగాల్ పర్యటన రద్దు..

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు బెంగాల్‌లో బహిరంగ సభలు, ర్యాలీలకు స్వస్తి పలికాయి. ఒక్క అధికార పార్టీ బీజేపీ మాత్రమే సభలు నిర్వహిస్తూ వచ్చింది. అయితే, రాష్ట్రంలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకొన్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సరఫరాపై మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులోకి  తెచ్చేందుకు ఉన్న మార్గాలపై చర్చించారు. ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్రాలకు వీలైనంత త్వరగా ఆక్సిజన్‌ అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తిని పెంచి వేగంగా సరఫరా చేసేందుకు ఉన్న వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ వివిధ మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు గత కొన్ని వారాలుగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు మోదీకి వివరించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement