Monday, April 29, 2024

Perfect Herbal Scam – హెర్బ‌ల్ ప్రాడ‌క్స్ట్ పేరుతో రూ 200 కోట్లు స్వాహా .. ఇద్ద‌రు అరెస్ట్

ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా నడుస్తున్న రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం ను హైద‌రాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు.. ఈ కేసులో ఇద్ద‌రిని అరెస్ట్ చేయ‌గా, మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు.. ఈ బడా స్కామ్ వివ‌రాల‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్ల‌డించారు. వనమూలికలతో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల పేరిట ఈ ముఠా దేశం మొత్తమ్మీద దాదాపు 7 వేల మందికి టోకరా వేసిందని వెల్లడించారు. నెలవారీ చెల్లింపుల పేరిట అమాయకులకు గాలం వేసి కోట్లు వసూలు చేశారని వివరించారు. ఇందుకోసం పలు పేర్లతో స్కీమ్ లు కూడా పెట్టారని తెలిపారు.

“పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్ ప్రకారం రూ.6 లక్షలు కట్టిన వారికి 30 నెలల పాటు నెలకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆశ చూపారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్ ప్రకారం రూ.25 లక్షలు కట్టిన వారికి 36 నెలల పాటు నెలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు. ఐడీ స్కీమ్ అని మరొకటి ఉంది. దీంట్లో రూ.9,999 కడితే 36 నెలల పాటు రూ.888 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇలాంటి పేమెంట్లే కాదు కార్లు, ఫ్లాట్లు, విహారయాత్రలు, బైకులు, ల్యాప్ టాప్ లు, నగలు కూడా కానుకలుగా ఇస్తామని ప్రజలను నమ్మించారు. వీరి ప్రకటనలు ఆకర్షణీయంగా ఉండడంతో జనాలు భారీగా డబ్బులు కట్టి స్కీమ్ లలో చేరారు. క్యూ మార్ట్ మోసాల కేసు దర్యాప్తు చేస్తుంటే, ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ స్కాం బయటపడింది. అంటూ సిపి తెలిపారు..

ఈ కేసులో ఇప్పటివరకు బాబీ చౌదరి, రియాజుద్దీన్ ల‌ను అరెస్ట్ చేశామ‌ని, పూజా కుమారి, షకీలా లు పరారీలో ఉన్నారు” అని తెలిపారు.. వారిని కూడా త్వ‌ర‌లో ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.. భారీ ప్ర‌క‌ట‌న‌లు చూసి మోస‌పోవ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement