Friday, April 26, 2024

Big Story: ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం.. విదేశాల్లో పేద విద్యార్థుల ఉన్నత చదవులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న పేద కుటుంబాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ పథకం కింద అందిన ఆర్థికసాయంతో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులతోపాటు అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు కూడా లబ్దిపొందుతున్నారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద అందజేసిన ఉపకార వేతనాలతో లక్షలాది మంది పేద విద్యార్థులు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌ డీ కోర్సులను పూర్తి చేస్తున్నారు.

ఎస్సీఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎస్సీ,ఎస్టీలకు మాత్రమే ఈ పథకం అమలయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ, ఈబీసీ, మైనారిటీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం అగ్రవర్ణ కులాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసింది. గతంలో గరిష్టంగా కేవలం పది లక్షల రూపాయల ఉపకార వేతనాన్ని మాత్రమే ఈ పథకం కింద అందించేవారు. ప్రస్తుతం రూ.20లక్షల వరకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనాన్ని అందిస్తోంది.

ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద అర్హత సాధించేందుకు ఆదాయ పరిమితిని కూడా రూ.4.50లక్షలకు పెంచారు. పదిశాతం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు హ్యూమనిటీస్‌, ఎకనామిక్స్‌, అకౌంట్స్‌, ఆర్ట్స్ విద్యార్థులకే పరిమితం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నాటి నుంచి 2022 వరకు ఎనిమిదేళ్లలో మొత్తం 4919 మంది విద్యార్థులు లబ్దిపొందగా, వీరి కోసం ప్రభుత్వం రూ.885.99 కోట్లు ఖర్చు చేసింది. లబ్దిపొందిన విద్యార్థుల్లో ఎస్సీ క్యాటగిరీలో 935 మంది, ఎస్టీ కేటగిరిలో 208మంది, బీసీలు 1603, మైనారిటీ విద్యార్థులు 2173 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇలాంటి పథకం ఉన్నా వంద మందిలోపే విద్యార్థులు ఎంపికయ్యారు. స్కాలర్‌షిప్‌ రూ.5లక్షల వరకే ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.20లక్షలకు పెంచింది.

- Advertisement -

మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌…

ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ఆర్థికసాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్లతో ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని 2015 మే 19న ప్రారంభించింది. ఎస్సీ విద్యార్థుల కోస ం అమలు చేస్తున్న మాదిరిగానే మైనారిటీ విద్యార్థులకు కూడా ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మైనారిటీలు మరింత ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాయమందిస్తోంది. మొదట్లో ఒక్కో విద్యార్థికి రూ.10లక్షల స్కాలర్‌షిప్‌తోపాటు విమానయాన ఖర్చులు కూడా ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం 10లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. మైనారిటీల కోసం ప్రవేశపెట్టిన ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద 2022నాటికి 2173 మంది విద్యార్థులు లబ్దిపొందారు. రూ.395కోట్లను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.

ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌…

ప్రతిభావంతులైన ఎస్సీఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం కింద అందజేసే ఆర్థికసాయాన్ని కూడా రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచింది. ఈ పథకం కింద మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ 35శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. 2014లో పథకం ప్రారంభం కాగా 2022 నాటికి 935 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.167.71 కోట్లు, 208 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.34.50 కోట్ల ఆర్థికసాయం అందించారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో విద్యను అభ్యసిస్తుండడం విశేషం. మరికొందరు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో చదువుకుంటున్నారు.

మహాత్మాజ్యోతిబాపూలే బీసీ విదేశీ విద్యానిధి…

బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ ఓవర్సీస్‌ స్కాలర్‌ పీస్‌ ప థకాన్ని ప్రవేశపెడుతూ 2016 అక్టోబరు 10 న జీవో 23ను జారీ చేసి ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్థికసాయం చేస్తున్నారు. 2022 నాటికి 1603 మంది బీసీ విద్యార్థులు లబ్దిపొందారు. వీరికోసం రూ.288.74 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కువ మంది ఆస్ట్రేలియా , కెనడాల్లోని వర్సిటీల్లోని విద్యను అభ్యసిస్తున్నారు.

మొత్తంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు ఓవర్సీస్‌ స్కాలర్‌ షిప్‌ పథకం 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు రూ.88581.39కోట్లను ఉపకార వేతనాలుగా అందజేసింది. ఇందులో 935 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.16771.21కోట్లు, 208 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.3450,.89కోట్లు, 1603 మంది బీసీ విద్యార్థులకు రూ.28874.87కోట్లు, మైనారిటీ వర్గానికి చెందిన 2173 విద్యార్థులకు గాను రూ.39484.42కోట్లను ఉపకారవేతనాలుగా అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement