Monday, April 29, 2024

KCR Yatra | మా బతుకులు ఆగమైనయ్‌.. కేసీఆర్‌తో గోడు వెల్లబోసుకున్న రైతులు

కరెంటు లేదు.. ప్రభుత్వం వ‌డ్లు కొంట‌లేదు.. మా బతుకులు ఆగమైనయ్‌ అంటూ రైతులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. బస్‌యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్జాలబాయి వద్ద ఐకేపీ సెంటర్‌ను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేపట్టారు. కేసీఆర్‌తో రైతులు మాట్లాడుతూ.. ఇరువై రోజులనుంచి కల్లాల్లో వ‌డ్లు పోసుకొని కూసున్నామని, కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంటు లేదని.. రైతుల‌ బతుకంతా ఆగమైందని కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నడి ఎండాకాలంలో నీళ్లు మత్తళ్లు దునికేవని.. మీరు ఉన్నప్పుడే బాగుండే సార్‌.. మళ్లీ మీ పాలనే రావాలని నినదించారు. రైతుబంధు లేదని.. రూ.500 బోనస్ అని చెప్పినా బోగస్‌ అయ్యిందని విమర్శించారు. కష్టపడి పండించి కల్లంల పోసిన ధాన్యాన్ని కొంటలేరని.. ఇక బోనస్ ఏమిస్తారు సార్‌ అని.. కాంగ్రెస్ పాలన అంత బోగస్ పాలన అయ్యిందంటూ విమర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పందిస్తూ.. మళ్లీ పోరాడి సాధించుకుందాం.. నీళ్లు కరెంటు మళ్లీ తెచ్చుకుందాం.. పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు అన్నెపర్తి వద్ద కేసీఆర్‌ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement