Saturday, April 27, 2024

National : ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో విపక్షాల మెగా మార్చ్

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది. ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ చేపడతామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు.

ఆదివారం ఆప్‌ నేతలతో కలిసి కాంగ్రెస్‌, సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, పురాతన రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మా నేత రాహుల్‌ గాంధీ యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదు’ అని అన్నారు.

31న ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement