Sunday, May 5, 2024

మేలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1, 2, 3, 4, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, ఇతర విభాగాల్లోని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు ఇప్పటికే వెలువడ్డాయి. దాదాపు అన్ని రకాల నోటిఫికేషన్లు వెలువడడమే కాకుండా వాటి నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గ్రూప్‌-1, పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే తుదిదశకు కూడా చేరుకుంది. ఇక మిగిలింది ముఖ్యమైన ఒకే ఒక నోటిఫికేషన్‌ టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌. ఎంతో మంది అభ్యర్థులు తమ ఆశల కొలువుగా చెప్పుకునే ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారు. టీచర్‌ పోస్టులను భర్తీ చేసే ఆలోచనలోనే ప్రభుత్వం కూడా ఉంది.

అయితే ఇప్పటికే సుమారు 15 నుంచి 20 వరకు ఉద్యోగ నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్‌సీ, పోలిస్‌రిక్రూట్‌మెంట్‌ బోర్డుతో పాటు వైద్యారోగ్యశాఖ నియామక సంస్థలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, సీనియారిటీ లిస్టు తదిరత ప్రక్రియ సాగుతోంది. 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లకు కూడా సాధారణ బదిలీల్లో అవకాశమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వారి నుంచి కూడా ఈనెల 14 వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ మొత్తం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మార్చి వరకు కొనసాగనుంది.

- Advertisement -

బదిలీ అయిన ఉపాధ్యాయులు ప్రస్తుతం పనిచేసే పాఠశాల నుంచి కొత్త చోటుకి బదిలీ అయిన స్కూల్‌కు ఏప్రిల్‌ 24న రిపోర్ట్‌ చేయవలసి ఉంటుంది. అప్పటి వరకు పాత స్కూల్‌ల్లోనే(పాత స్టేషన్‌) విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ రాష్ట్రంలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలు, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఉపాధ్యాయ ఖాళీల లెక్కతేల్చిన తర్వాతే టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చెయనున్నారు. ఏప్రిల్‌ల్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగియనుండటంతో దాదాపు మేలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు 13 వేలు…

చాలా కాలం తర్వాత టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ తర్వాత మెగా డీఎస్సీ లేదా టీఆర్టీ ఉంటుందని బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్‌ పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది. స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ పోస్టులు 13 వేల వరకు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. టీచర్ల హేతుబద్ధీకరణ తర్వాత మరో ఐదు వేలకుపైగా ఖాళీలు ఏర్పడనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో త్వరలోనే 10 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 10 వేల నుంచి 15 వేల వరకు టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే టీచర్‌ పోస్టుల నియామక ప్రక్రియను డీస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ(డీఎస్సీ)కి అప్పగిస్తారా లేదా టీఎస్‌పీఎస్‌సీకి అప్పగిస్తారా అనే అంశంపై ఇంకా ఇంత వరకు విద్యాశాఖ ఒక పూర్తి స్పష్టతకు రాలేదు. సీఎస్‌గా సోమేష్‌ కుమార్‌ ఉన్నప్పుడు డీఎస్సీకే మొగ్గుచూపినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం సీఎస్‌గా శాంతికుమారి ఉండడంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement