Tuesday, April 30, 2024

Nizamabad – నూతన పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల వికాసం – మంత్రి వేముల

మోర్తాడ్ /వేల్పూర్ ఆగస్టు 18 (ప్రభ న్యూస్ ) – నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం మోర్తాడ్ మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన మార్పులతో తెలంగాణ పల్లెలు సర్వతో ముఖాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీలను వికేంద్రీకరిస్తూ జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందన్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తూ తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలన్నీ వికాసాన్ని సంతరించుకొని యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం పెరిగి, ఇంటింటికి తడి పొడి చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు వంటి వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. గడిచిన యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధి, నూతన పంచాయతీరాజ్ చట్టంతో అతి స్వల్ప కాలంలోనే సాధ్యపడిందని మంత్రి తెలిపారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు వరించిన అవార్డులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. సమగ్ర ప్రగతి, సదుపాయాల కల్పన కొలమానంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వరించాయని వివరించారు. వీటిలో నిజామాబాద్ జిల్లాలో ఐదు గ్రామ పంచాయతీలు, బాల్కొండ నియోజకవర్గంలోని ఒక గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ఉత్తమ జీపీగా గుర్తింపు లభించడం జరిగిందన్నారు. ఈ విషయమై నీతి ఆయోగ్ లో సైతం చర్చ జరిగిందన్నారు. తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతోనే పల్లెలు ప్రగతి దిశగా పయనిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని స్వయంగా నీతి ఆయోగ్ వెల్లడించడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతకు తార్కాణం అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల కృషి, పట్టుదలతోనే పల్లెల వికాసం సాధ్యపడిందని, ఈ దిశగా స్ధానిక ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో తోడ్పాటును అందించారని అభినందించారు. ప్రస్తుతం నాలుగేళ్ళ సర్వీస్ ను పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ, గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమించిన నేపథ్యంలో పల్లెల అభ్యున్నతి కోసం మరింత అంకిత భావంతో పని చేయాలని సూచించారు. నిస్వార్థంతో, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలందిస్తే, మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పిటిసి రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీఎల్పీఓ శ్రీనివాస్, సర్పంచ్ భోగ ధరణి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు.
భీమ్‌గల్ మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 18 మందికి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమం లో రాష్ట్ర రొడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పదోన్నతి పొందిన 18 మందికి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విజయవంతం చేసేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పదోన్నతి కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రొడ్డు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీవో గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ళ సముదాయానికి కేసీఆర్ కాలని గా నామకరణ.

వేల్పూర్ / మోర్తాడ్ – బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ సముదాయాన్ని ప్రారంభించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, డబుల్ లబ్ధి దారుల ఎంపిక ఎంతో పారదర్శకంగా చేపట్టినా..కేవలం గైడ్ లైన్స్ ప్రకారం అర్హులని ఎంపిక చేశామ‌న్నారు.. మోర్తాడ్ లో 15 కోట్ల నిధులతో 224 ఇండ్లు కట్టించామ‌ని,.ప్రస్తుతం 155 మంది లబ్ధి దారులకు అందించామ‌న్నారు…మిగితా ఇళ్లను రెండవ విడత లో అర్హులకు త్వరలో మంజూరు చేస్తామ‌న్నారు..పేదవారి స్వంతింటి కల నిజం చేసేందుకు మరో పథకం గృహ లక్ష్మి కి కూడా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అంటూ 120 మంది లబ్ధి దారులకు మోర్తాడ్ లో గృహలక్ష్మి మంజూరు చేశామ‌న్నారు.

సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
మోర్తాడ్ మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement