పశ్చమబెంగాల్లో కమ్యూనిస్టులను నిలదొక్కుకుండా చేసి ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే ఓవర్గం తయారవుతోందా? అన్న ప్రశ్నలు అందరిలోనూ వస్తున్నాయి. ఎందుకంటే తృణమూల్ కోటగా భావించే హజ్రాలో వెలసిన పోస్టర్లే దీనికి కారణమంటున్నారు చాలామంది పరిశీలకులు. ఆశ్చర్యమేమిటంటే.. ఈ పోస్టర్లలో మమతా బెనర్జీ లేకపోవడమే కాకుండా కొత్తగా మరో ఆరు నెలల్లో కొత్త తృణమూల్ పార్టీని చూస్తారనే సందేశం ఉంది. వాల్ పోస్టర్లలో టీఎంసీ లోగోతోపాటు అభిషేక్ బెనర్జీ ఫొటో ఉండడం గమనార్హం. ప్రజలు కోరుకున్నట్టే మరో ఆరు నెలల్లో కొత్త టీఎంసీ వస్తుంది అని ఆ పోస్టర్లలో రాశారు.
ఈ ఏరియా మమతా బెనర్జీ నివాసం ఉండే ఏరియా కావడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అంటున్నారు పరిశీలకులు. ఈ పోస్టర్లను చూసిన వారంతా ‘‘6 నెలల్లో కొత్త టీఎంసీ”అంటే ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్లో అంతా బాగానే ఉందా అనేది కూడా ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ పోస్టర్లపై రాజ్యసభ ఎంపీ డాక్టర్ శంతను సేన్ స్పందించారు. TMCలో అసంతృప్తులు ఉన్నాయనే వాదనను ఆయన ఖండించారు.
పార్టీలో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఫ్యాక్షనిజం వంటివి ఉండడానికి ఇది బీజేపీ కాదన్నారు శంతను సేన్. మమతా బెనర్జీ తమ నాయకురాలని అభిషేక్ బెనర్జీ కూడా స్వయంగా ఈ విషయాన్ని అన్ని సందర్భాల్లోనూ చెప్పారన్నారు. ఇది పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ చేసిన పనికాకపోవచ్చని శాంతను సేన్ అన్నారు.