Wednesday, July 24, 2024

All Set – నాలుగో ద‌శకు అంతా రెడీ పోలింగ్‌కు స‌ర్వం సిద్దం

సార్వత్రిక సమరంలో నాలుగోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ విడతలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. న‌క్స‌ల్స్, ఏజెన్సీ ప్రాంతాల్లో పొలింగ్ నాలుగు గంట‌ల‌కే ముగియ‌నుండ‌గా, మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఎన్నికలసంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోలింగ్ ఏర్పాట్ల కోసం సిబ్బంది ఇప్పుడిప్పుడే మెటిరియ‌ల్ కలెక్ష‌న్ కేంద్రాల నుంచి వారికి కేటాయించిన కేంద్రాల‌కు చేరుకుంటున్నారు.

ఏపీలో అసెంబ్లీకిఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణ 17, ఉత్తర ప్రదేశ్ 13, మహారాష్ట్ర 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8చొప్పున, బీహార్ 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. ఈనెల 13న జరిగే తొలివిడతలో 28స్థానాలకు, ఈనెల 20న జరిగే రెండో విడతలో 35, ఈనెల 25న 42, జూన్ 1న 42శాసనసభ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.

నాలుగో విడతలో భాగంగా బీహార్‌లో దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్, ఝార్ఖండ్‌లోని సింఘ్‌భూమ్, ఖుూంటి, లోహర్దగ, పాలాము స్థానాల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఇందౌర్, ఖర్గోన్, ఖాండ్వా లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.

- Advertisement -

మహారాష్ట్ర‌లో..మహారాష్ట్రలో నందుర్బార్, జల్గావ్, రావెర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పుణె, షిరూర్, అహ్మద్‌నగర్, షిర్డీ, బీడ్‌లో కూడా పోలింగ్ జరగనుంది.

ఒడిశాలో నబరంగ్‌పుర్, బెర్హంపుర్, కోరాపుట్, కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో షాజహాన్‌పుర్, ఖేరీ, ధౌరాహ్రా, సీతాపుర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్‌లో పోలింగ్ జరగనుంది.

పశ్చిమబంగాల్‌లో బహరంపుర్, కృష్ణానగర్, రణఘాట్, బర్ధమాన్ పుర్బా, బుర్ద్వాన్-దుర్గాపుర్, అసన్సోల్, బోల్పూర్, బీర్భూమ్‌లో ఓటింగ్ నిర్వహించనున్నారు .

ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌ముఖులు…

నాలుగో విడత జరగనున్న 96 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ పోలింగ్‌లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. నాలుగోదశలో కేంద్రమంత్రులు గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు.

బిహార్‌లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటైన బెగుసరాయ్‌ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేస్థానం నుంచి భాజపా తరఫున మళ్లీ బరిలో నిలిచారు. బెగుసరాయ్‌ని బిహార్‌ మినీ మాస్కోగా పిలుస్తారు. ఇక్కడ భూమిహార్‌ వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిరాజ్‌సింగ్‌సహా ఇప్పటివరకు అక్కడ నుంచి గెలిచిన ఎంపీల్లో అత్యధికులు ఆవర్గంవారే. 2019 ఎన్నికల్లో…సీపీఐ అభ్యర్థి కన్నయ్య కుమార్‌పై గిరిరాజ్‌ 4.2లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 86శాతం హిందూ జనాభా కలిగిన బెగుసరాయ్‌…ఎన్డీయేకు కంచుకోటగా ఉంది. అందుకే గిరిరాజ్‌ సింగ్‌ ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉన్నారు

. విప‌క్షనేత అధీర్ రంజ‌న్ కు అగ్నిప‌రీక్ష‌..

పశ్చిమ బంగాల్‌లో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముర్షిదాబాద్‌ జిల్లాలోని బహరంపుర్‌ లోక్‌సభ స్థానం అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి 1999 నుంచి బహరంపుర్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి అధీర్‌ రంజన్‌కు పోటీగా మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన యూసఫ్‌ పఠాన్‌ అన్ని రకాల క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి 2021లోనే రిటైరయ్యారు. బహరంపుర్‌లో ఐదు సార్లు ఎంపీగా నెగ్గిన అధీర్‌…ఈసారి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, కార్మికుల వలసలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి నిర్మల్‌ చంద్ర సాహ పోటీ చేస్తున్నారు. ప్రముఖ వైద్యుడిగా ఆయనకు పేరుంది.

ల‌స‌న్ఫోల్ లో బాలీవుడ్ న‌టుడు శ‌త్రుష్ను సిన్హా..

బాలీవుడ్‌లో బిహారీబాబుగా గుర్తింపు పొందిన కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్న సిన్హా… పశ్చిమ బంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి టీఎంసీ తరఫున రెండోసారి బరిలో నిలిచారు. ఇక్కడ దాదాపు 50శాతం మంది బెంగాలీయేతరులే ఉన్నారు. అందులో అత్యధికులు బిహారీలు కావటం శత్రుఘ్నసిన్హాకు కలిసి వచ్చే అంశంగా మారింది. అందుకే 2022 ఉపఎన్నికల వేళ టీఎంసీ వ్యూహాత్మకంగా ఆయనకు టికెట్‌ ఇచ్చింది. అప్పుడు విజయం సాధించిన సిన్హా…మళ్లీ బరిలో దిగారు. ఆయన్ను బయటి వ్యక్తిగా ప్రచారం చేస్తున్న బీజేపీ…స్థానికంగా సర్దార్‌జీగా సుపరిచితుడైన కేంద్ర మాజీమంత్రి సురేంద్రజీత్‌సింగ్‌ అహ్లువాలియాకు టికెట్‌ ఇచ్చింది. స్థానికుడికి, స్థానికేతరుడికి మధ్య పోరుగా ఈ ఎన్నిక మారింది. ఇక్కడ సీపీఎం కూడా పోటీ చేస్తున్నప్పటికీ…ప్రధానంగా సిన్హా, సర్దార్‌జీ మధ్యే నువ్వా-నేనా అన్నట్లు పరిస్థితి తయారైంది. తాగునీటి కొరత, నిరుద్యోగం అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

.క‌న్ఫోజ్ బ‌రిలో అఖిలేష్ యాద‌వ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు. తొలుత ఆర్జెడీ అధ్యక్షుడు లాలుప్రసాద్‌ యాదవ్‌ అల్లుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన ఎస్పీ…తర్వాత మనసు మార్చుకుని అఖిలేశ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. 2000, 2004, 2009 ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి అఖిలేష్‌ ఎంపీగా గెలుపొందారు. 2012లో సీఎం పగ్గాలు చేపట్టాక ఆయన రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా గెలుపొందారు. 2014లోనూ రెండోసారి గెలిచిన ఆమె… 2019 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. డింపుల్‌ ఈసారి మైన్‌పురి నుంచి బరిలో నిలిచారు. మరోసారి సిటింగ్‌ ఎంపీ సుబ్రత్‌ పాఠక్‌కు బీజేపీ టికెట్‌ కేటాయించింది. అయిదేళ్లక్రితం తన సతీమణి డింపుల్‌ను ఓడించిన సుబ్రత్‌పై బదులు తీర్చుకోవాలని అఖిలేశ్‌ బరిలో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement