23 లక్షల మంది హాజరు
దేశ వ్యాప్తంగా ఒక్క సీటు కోసం 21 మంది పోటీ
విద్యార్ధులు కొంప ముంచిన ఫిజిక్స్
700 మార్కులు రావడం అసాధ్యం
కటాఫై మార్క్ లు 145 గా ఉండే అవకాశం
440 మార్కులు వస్తే కన్వీనర్ కోటా సీటు
ఎంబీబీఎస్, ఆయుష్, బీడీఎస్ లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 557 నగరాల్లోనూ, విదేశాల్లో 14 నగరాల్లోనూ నీట్ పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు. నిన్న మే 5వ తేదీ మద్యాహ్నం 2 గంటల్నించి 5.20 గంటల వరకూ నీట్ పరీక్ష జరిగింది. ఫలితాలు జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్ష సంస్థ ప్రకటించింది. ఈ నెలాఖరులోగా నీట్ ‘కీ’ విడుదలయ్యే అవకాశం ఉంది.
పేపర్ లీక్ ..
అయితే రాజస్థాన్లోని ఓ సెంటర్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఆందోళన రేగింది. ఎన్టీఏ దీనిపై క్లారిటీ ఇచ్చింది. పరీక్ష ముగిసిన కాస్సేపటికి పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వ్యాపించాయి. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని ఓ పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం ప్రశ్నాపత్రాలిచ్చారు. జరిగిన పొరపాటును అక్కడున్న ఇన్విజిలేటర్ సరిదిద్దేలోగా విద్యార్ధులు బలవంతంగా పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం విద్యార్ధులు అలా వెళ్లకూడదు. పరీక్ష ముగిసిన తరువాతే వెళ్లాలి. దాంతో ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని, పేపర్ మాత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్లో జరిగిన ఈ పొరపాటుపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఆ సెంటర్లోని 120 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
కొంప ముంచిన ఫిజిక్స్ ..
గత ఏడాది కెమిస్ట్రీ పేపర్ లో విద్యార్ధులు నష్టపోతే ఈసారి ఫిజిక్స్ పేపర్ కొంప ముంచింది.. ముఖ్యంగా ఫిజిక్స్లో కఠినమైన ప్రశ్నలు ఇచ్చినట్లు నీట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తం 720 మార్కులకు ఈసారి 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే చాలని పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 704 మెడికల్ కాలేజీల్లో 1,07,948 ఎంబీబీస్ సీట్లున్నాయి. ఒక్కో సీటుకు సగటున 21 మంది పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది నీట్కు హాజరయ్యారు. 13 లక్షల మంది అమ్మాయిలు, 10 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు.
కఠినంగా ఫిజిక్స్ ప్రశ్నలు
నీట్లో ఈసారి ఫిజిక్స్లో థియరీటికల్, ట్విస్ట్ చేసి ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారని, ఈ తరహా ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబు ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని విద్యార్థులు అంటున్నారు. కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిగ్గా ఇచ్చారని చెబుతున్నారు. జువాలజీ నుంచి రెండు ప్రశ్నలు సిలబ్సలో లేనివి ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. ఇప్పటిదాకా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్లో వచ్చిన మార్కుల క్రమాన్ని బట్టి మొదటి ర్యాంకు ఇచ్చేవారు. ఈసారి ఆ పద్ధతి మార్చారు. బోటనీ, జువాలజీలో అందరూ సరైన జవాబులిచ్చి.. సమంగా మార్కులు సాధిస్తున్నారు. దాంతో కఠినంగా ఉండే ఫిజిక్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ర్యాంకును నిర్ణయించనున్నారు.
700 మార్కుల దాటడం అసాధ్యం..
ఎప్పుడూ రసాయనశాస్త్రం నుంచి కఠినమైన, తికమకపెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఈసారి భౌతికశాస్త్రం నుంచి అటువంటి ప్రశ్నలు అడిగారు. గతంలో మాదిరిగా ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 700 మార్కులు పైగా తెచ్చుకోవడం ఈసారి అంత తేలిక కాదు. మన దగ్గర 80 వేల మంది హాజరైతే 20 వేల మందే చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యేవారుంటారు. 440 మార్కులపైన తెచ్చుకోగలిగితే కన్వీనర్ కోటాలో సీటు వస్తుంది. గత ఏడాది నీట్ కటాఫ్ 137 మార్కులు ఉండగా.. ఈసారి అది 140-145 మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది పూర్తి మార్కులు (720) సాధించడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో రెండుసార్లు 710-720 మధ్య చాలామంది స్కోర్ చేశారని, ఈసారి 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 8,490 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఈ ఏడాది మరికొన్ని పెరిగి 9 వేలకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది సుమారు 80 వేల మంది పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది 450 మార్కుల వరకు ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది. నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య బట్టి తెలంగాణలో ఒక్కో సీటుకు సగటున 8 మంది పోటీపడుతున్నారు.