Sunday, April 28, 2024

Delhi | నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త నిబంధనలు సడలించండి : విడుదల రజని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. నిబంధనలను సడలించి పాత పద్ధతి కొనసాగించాలని కోరుతూ ఆమె కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రితో సమావేశమైన మంత్రి విడదల రజిని కొత్త నిబంధనలను సడలించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రజిని, ఎన్‌ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చిందని, ఆ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద సీట్లు చొప్పున మాత్రమే అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కొత్త మెడికల్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వాలంటే 605 పడకల సామర్ధ్యంతో ఆసుపత్రి కూడా ఉండాలని ఎన్‌ఎంసీ తాజాగా నిర్ణయించిందని చెప్పారు.

ఈ రెండు నిబంధనల వల్ల కొత్తగా ఏర్పడిన తమ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌లో టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. దీనివల్ల ఏకంగా రూ. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారని వివరించారు.

వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన 12 కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వచ్చే ఏడాది 5 కొత్త కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకు సంబంధించి సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయని వివరించారు. కొత్త నిబంధనల వల్ల తమ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకామే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

వైద్య  ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొస్తున్న గొప్ప గొప్ప సంస్కరణలకు మీ వంతు సహకారం ఉండాలని, ఏపీకి ఆధునిక వైద్యం అందే విషయంలో ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని మంత్రి వినతి పత్రంలో పేర్కొన్నారు.

మంత్రి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ఆదిత్యనాథ్ దాస్, ఏపి భవన్ అడిషనల్ రెసిడెంట్ కమీషనర్ హిమాంశు కౌశిక్, ఏపీఎంస్ఐడీసీ ఎండి మురళీధర్ రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement