Wednesday, May 1, 2024

ఈ-స్టాంపింగ్‌పై మరింత ఫోకస్‌.. నెంబరింగ్‌తో నకిలీలకు చెక్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఈ స్టాంపింగ్‌ ప్రక్రియపై ఫోకస్‌ పెంచే యోచనలో ఉంది. ఆస్తులకు సంబంధించిన క్రయ, విక్రయాల డాక్యుమెంట్లలో నకిలీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్టాంపింగ్‌ విధానాన్ని రెండేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో గత మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియను అమల్లోకి తెచ్చినా ప్రస్తుతానికి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ు కొనసాగిస్తున్నారు. ఈ స్టాంపింగ్‌ను పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

మాన్యువల్‌ స్టాంపు పేపర్లు నాసిక్‌ నుంచి దేశం మొత్తంగా సరఫరా అవుతున్నాయి.. రూ.10, 20, 50, 100తో పాటు రూ.500 వరకు స్టాంపులు ప్రస్తుతానికి విడుదలవుతున్నాయి.. ప్రస్తుతం 10 రూపాయల స్టాంప్‌ పేపర్‌ త యారీకి పాతిక రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల విభాగం ప్రభుత్వానికి వివరించింది. ఈ నేపథ్యంలో ఈ స్టాంపింగ్‌ ను తప్పనిసరి చేసే దిశగా ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. దీనివల్ల స్టాంప్‌ విక్రయదార్లకు నష్టం కలుగుతుందని చెబుతున్నా అందుకు ప్రత్యామ్నాయంగా ఈ స్టాంపింగ్‌ ప్రక్రియ కూడా నిర్వహించే విధంగా వారికి అనుమతిచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

నాసిక్‌ నుంచి రాష్ట్రాలకు తగినన్ని స్టాంపులు సరఫరా కాకపోవటంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఈ కారణంగా భారీ మొత్తంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌లు వినియోగిస్తారు. బ్లాక్‌ మార్కెట్‌ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నియంత్రణ చర్యలపై కసరత్తు జరిపింది. అంతేకాదు గత ఏడాదిన్నర క్రితం నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపివేసిన సంగతి విదితమే. కాంప్రెహెన్సివ్‌ ఫైనాన్స్‌ మేనేజిమెంట్‌ సిస్టం (సీఎఫ్‌ఎంఎస్‌)లో కూడా లోపాలు ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని వివిధ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకోవటంతో పాటు పలువురు అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించింది.

సీఎఫ్‌ఎంఎస్‌ చెల్లింపులకు ప్రత్యామ్నాయాలను అనుసంధానం చేయటం ద్వారా చెక్‌ పెట్టినప్పటికీ నకిలీలకు అడ్డుకట్ట పడలేదు. దీంతో ఈ స్టాంపింగ్‌ను అమల్లోకి తెచ్చింది. స్టాంపు విక్రేతలకు కూడా ఈ స్టాంపింగ్‌కు అనుమతినిచ్చింది. సేవ కేంద్రాల్లో కూడా వీటిని అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానం ద్వారా స్టాంపు పేపర్లపై అమ్మకపు, కొనుగోలు దార్ల పేర్లు ముద్రించి వస్తాయి. ఆస్తుల విలువ ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ల ప్ర క్రియను నిర్వహిస్తారు. కాగా ఈ స్టాంపింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి పేపర్‌కు నెంబరింగ్‌ ఉంటుంది. దీంతో నకిలీ డాక్యుమెంటేషన్‌ కుదరదని చెబుతున్నారు.

నాన్‌ జుడీషియల్‌ స్టాంపుల చలానాలను జారీ చేసేందుకు ఇటీవలే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌తో ఎంవోయు కుదుర్చుకుంది. రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ బ్యాంక్‌ చలానాలు కూడా చెల్లుబాటు కానున్నాయి. సాధారణ స్టాంపుల సేకరణకు చలానాలు తీసుకున్నా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బారులుతీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ స్టాంపింగ్‌ను పటిష్టంగా అమలు చేయటం వల్ల భవిష్యత్తులో అదనపు ధర చెల్లించి నాసిక్‌ నుంచి స్టాంపు పేపర్లు కొనుగోలు చేసే పరిస్థితులు కూడా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు కృత్రిమ కొరత సాకుతో జరిగే బ్లాక్‌ మార్కెట్‌కు కూడా అడ్డుకట్ట వేయవచ్చనేది ప్రభుత్వ భావన.

Advertisement

తాజా వార్తలు

Advertisement