Saturday, May 4, 2024

గోదావరి ఆర్చ్‌ వంతెనపై గరిష్ఠ వేగం పెంపు.. రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణతో గంటకు 50 కిలోమీటర్ల వేగం

అమరావతి, ఆంధ్రప్రభ: రైల్వే ట్రాక్‌ మరమ్మతుల నిర్వహణ, భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గోదావరి ఆర్చ్‌ వంతెనపై గరిష్ఠ వేగం పెరిగింది. రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేయడం ద్వారా వంతెనపై రైళ్లు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనున్నాయి. అత్యంత భద్రతతో పాటు పరిమితులకు లోబడి వీలైన మార్గాల్లో గరిష్ఠ వేగాన్ని పెంచడం కోసం దక్షిణ మధ్య రైల్వే రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా గోదావరి-కొవ్వూరు స్టేషన్ల మధ్య గోదావరి ఆర్చ్‌ వంతెనపై రైళ్ల గరిష్ట వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది.

2015 సంవత్సరం నుంచి గోదావరి వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 30 కిలోమీటర్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వేగ పరిమితిని గంటకు 40 కిలోమీటర్లకు పెంచారు. ఆ తరువాత ఇప్పుడు వేగ పరిమితిని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లను 2.9 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనపై నడుపుతున్నారు. గోదావరి- కొవ్వూరు మధ్య దూరం 5 కిలోమీటర్లు ఉంది. గూడూరు- దువ్వాడ సెక్షను గ్రాండ్‌ ట్రంక్‌ రూటు-లో(గోల్డెన్‌ డయాగ్నల్‌) ఉన్న ఈ వంతెన దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతానికి ప్రధాన వారధి. గోదావరి నదిపై 2.9 కిలోమీటర్ల పొడవున్న కమాను వంతెనపై రైళ్లను గరిష్ట సామర్ధ్యంతో నడుపుతున్నందున ప్రయాణికులు, సరుకుల రవాణాలో ఇది కీలకంగా మారింది.

గోదావరి నదిపై అతి ముఖ్యమైన ఈ వంతెన ఉన్న ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకొని 2015 నుంచి గత ఏప్రిల్‌ వరకు గంటకు 30 కిలోమీటర్లకు మించి వెళ్ళగూడదనే పరిమితి విధించారు. ఇటీ-వల దక్షిణ మధ్య రైల్వే అధికారులు అధునాతన యంత్రాలతో కఠినమైన పరిస్థితుల్లో వంతెన, ట్రాక్‌ పరీక్షలు జరిపారు. అవసరమైన స్లీపర్లను మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి గరిష్ఠ వేగాన్ని గంటకు 40 కిలోమీటర్లకు పెంచడం సాధ్యమైంది. ఇప్పుడు వేగానికి సంబంధించిన పరీక్షలు జరిపి ప్రయాణికుల రైళ్లు, గూడ్స్‌ రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లకు పెంచి రైళ్లను విజయవంతంగా నడుపుతున్నారు.

జోన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఈ టాస్క్‌ను అంకిత భావంతో పూర్తిచేసిన సిబ్బందిని, ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ బృందాన్ని ఇంచార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు. తూర్పు, పశ్చిమాలకు వారధిగా ఉన్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచడం వల్ల రద్దీ తగ్గుతుంది. అంతేకాక రైలు సర్వీసుల నిర్వహణ సునాయాసం కావడంతోపాటు సమయపాలన నిర్దిష్టంగా చేయవచ్చని వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement