Friday, May 3, 2024

బీజేపీ కార్యాలయంలో సంబరాలు, సోము నేతృత్వంలో పార్టీ బలపడిందన్న నేతలు

అమరావతి, ఆంధ్రప్రభ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపధ్యంలో ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద ఎన్‌టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం ఆధ్వర్యంలో బుధవారం పెద్ద సంఖ్యలో వచ్చిన నేతలు, కార్యకర్తలు బాణా సంచ కాల్చి మిఠాయిలు పంచారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి డబ్బు వాయిద్యాల మధ్య కార్యాలయంలోకి ఆహ్వానించి కేక్‌ కట్‌ చేయించారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న వీర్రాజును బొకేలు, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ శివన్నారాయణ మాట్లాడుతూ వీర్రాజు రెండేళ్ల ప్రస్తానాన్ని కార్యకర్తలకు వివరించారు. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా రాష్ట్ర పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. హిందూ ఆలయాలపై దాడులు మొదలు రేషన్‌ బియ్యం, పెండింగ్‌ ప్రాజెక్టులు, వరద ముంపు బాధితులకు సహాయ సహకారాలు, రైతుల సమస్యలు, అంగన్‌వాడీల్లో నాసిరకం భోజనాలు సహా అనేక సమస్యలపై అలుపెరగని పోరాటం చేసినట్లు కొనియాడారు. రాష్ట్ర బీజేపీ మీడియా ఇన్‌చార్జి కేవీ లక్ష్మీపతి రాజా మాట్లాడుతూ సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమైందని చెప్పారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం ద్వారా రాస్ట్రంలో అధికారం దిశగా బీజేపీ వెళ్లేందుకు చర్యలు చేపట్టారన్నారు. తనను కలిసి అభినందనలు తెలిపిన నేతలు, కార్యకర్తలతో కొంత సేపు సోము వీర్రాజు ఆత్మీయంగా సమావేశమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement