Sunday, April 28, 2024

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యా, బిడ్డలను చంపేసి తాను సూసైడ్​ చేసుకున్నాడు

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతోపాటు మూడు నెలల చిన్నారిని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బరేలీలో ఇవ్వాల (శనివారం) జరిగింది. రాంప్రకాష్ (26) అతని భార్య మీను( 24) వారి మూడు నెలల కుమార్తె కృష్ణ ఇంట్లో శవమై కనిపించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు. తెల్లవారుజాము వరకు ఎవరూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా రాంప్రకాష్ కండువాతో ఉరివేసుకుని కనిపించాడు. మంచంపై అతని కుమార్తె, భార్య మృతదేహాలున్నాయి.

ఉత్తమ్ గంజ్ వెస్ట్ ప్రాంతానికి చెందిన రాంప్రకాష్‌కు 18 నెలల క్రితం మీనూతో వివాహమైంది. భార్య, బిడ్డను హత్య చేసి రాంప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సజ్వాన్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలన చేస్తున్నారని, మూడు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు స్పీడప్​ చేసినట్టు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement