Friday, May 17, 2024

AP: వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కోసం ధర్మప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరి కాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరిప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయంనకు చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచారరథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చింకా శ్రీనివాస రావు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజినీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు, ఇంజినీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో ఒక శునకం, కాలభైరవుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ప్రతి పౌర్ణమి రోజున శ్రీ అమ్మవారి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణలో మొదటి నుండి చివరి వరకు అందరితో పాటుగా పాల్గొనడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement