Sunday, April 28, 2024

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఐక్యంగా పోరాడుదాం : జేడీ లక్ష్మీనారాయణ

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గాలంటే ఉద్యమం చేయడం తప్ప మరో మార్గం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శనివారం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని ఆరోపించారు. కార్మికులు, నిర్వాసితులు, మేధావులు కలిసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రజల తరఫున విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో తాను పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఉదయం కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చి ప్లాంట్ ను ప్రైవేటీకరించడం లేదని చెప్పి వెళతారు, సాయంత్రానికి కేంద్రం ప్రైవేటీకరణ ఆగబోదని ప్రకటన విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని అన్నారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ పేరుతో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పాదయాత్ర చేపట్టింద‌ని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. ప్రైవేటీకరణే కేంద్రం విధానమైతే ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement