Saturday, April 27, 2024

కిచ్చా సుదీప్ మూవీస్..పోస్ట‌ర్ల‌పై నో బ్యాన్.. ఈసీ

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి మ‌ద్ద‌తు ఇచ్చింది ఈసీ. బీజేపీ నేతల తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు సుదీప్. బ‌స‌వ‌రాజ్ బొమ్మై తో ఉన్న అనుబంధంతోనే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌న్నారు. ఇది ఆయ‌న‌కు మరో దఫా రాజకీయ సమరానికి వేదికైంది. అయితే, ఈ విషయంలో కిచ్చా సుదీప్ కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆయ‌న సినిమాలు, షోలు, ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల కమిష‌న్ కు సైతం ఫిర్యాదులు అందాయి. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్ ప్రకటనలు, సినిమాలు, పోస్టర్లపై నిషేదం విధించాలని కోరుతూ జేడీఎస్ తో పాటు ప‌లువురు న్యాయ‌వాదులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కిచ్చా సుదీప్ ప్రకటనలు, సినిమాల ప్రదర్శనపై ఎలాంటి నిషేధం ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జేడీఎస్ కిచ్చా సుదీప్ పై విమర్శల దాడి చేసింది. అలాగే, ప‌లువురు న్యాయ‌వాదులు సైతం ఆయ‌న నిర్ణ‌యం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శివమొగ్గకు చెందిన న్యాయవాది శ్రీపాల సుదీప్ కు వ్యతిరేకంగా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న సుదీప్ తన సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నటుడు సుదీప్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ఎన్నికలు ముగిసే వరకు ఆయన సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లు ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జేడీఎస్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. సినిమాలు, ప్రకటనలు, పోస్టర్లు వంటివి పెడితే అది ఓటర్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఎన్నికలు ముగిసే వరకు సుదీప్ ఫోటోతో కూడిన ఏ షో, ప్రకటన లేదా సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ జేడీఎస్ లీగల్ వింగ్ ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న నటుడు కిచ్చా సుదీప్ తన సినిమాలు, ప్రకటనల ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. కిచ్చా సుదీప్ సినిమా, ప్రకటనల ప్రదర్శనపై ఎలాంటి ఆంక్షలు లేవని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. దీంతో సుదీప్ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం, శిగ్గాంవితో పాటు నాయకి కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సుదీప్ ప్రచారం నిర్వ‌హిస్తార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement