Sunday, May 5, 2024

తెలంగాణ అంటేనే చారిత్ర‌క ప్రాశాస్త్యం….కెసిఆర్ ‘వరల్డ్‌ హెరిటేజ్ డే’ సందేశం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘వరల్డ్‌ హెరిటేజ్‌ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని స్మరించుకున్నారు. నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ(16) మహాజనపథాల్లో, దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జనపథమైన అస్మక మహాజనపథం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్‌ (నాటి పౌధన్య పురం) కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గడ్డకున్న ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటు-తున్నదని అన్నారు. శాతవాహన వంశం నుంచి మొదలు అసఫ్‌ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని సీఎం పేర్కొన్నారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖ నాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని అన్నారు. 45 వేల ఏండ్ల క్రితమే తెలంగాణ నేల మీద మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీనమానవుని పెయింటింగ్స్‌ నిదర్శనమన్నారు.
జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్‌ చర్చి, మక్కా మసీదు, చార్మినార్‌ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటు-తున్నాయని సీఎం పేర్కొ న్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని, ప్రసిద్ధ రామప్ప దేవాల యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. దీంతో పాటు- దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ అవార్డు, కుతుబ్‌షాహి టు-ంబ్స్‌ కాంప్లెక్స్‌లోని మెట్లబావికి యునెస్కో అవార్డు వంటి పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధిస్తూ ఘనమైన తెలంగాణ వారసత్వం, ప్రపంచ వారసత్వం సంపదగా వెలుగులోకి వస్తున్నదని తెలిపారు.
నాటి ఉమ్మడి పాలనలో విస్మరించబడిన తెలంగాణ చారిత్రక సంపదను వారసత్వాన్ని, తెలంగాణ గత ప్రాశస్త్యా న్ని, వైభవాన్ని పునరుజ్జీవింపచేసి భావితరాలకు అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని కేసీఆర్‌ అన్నారు. ఈ దిశగా రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక పర్యాటకశాఖల కృషిని సిఎం అభినందించారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు మేధావులు స్వచ్ఛందంగా కొనసాగిస్తున్న కృషి అభినందనీయమని సిఎం అన్నారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవడంలో తెలంగాణ పౌరులు చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం మరింతగా పెరగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement