Wednesday, May 1, 2024

మోదీకి లేఖ రాసిన యువతి.. అలా అయితేనే పెళ్లి చేసుకుంటానని వెల్లడి

కర్ణాటకకు చెందిన ఓ యువతి ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై, ప్రధాని మోదీలకు లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె ఓ ప్రతిజ్ఞ చేసింది. ‘సార్​ మా ఊరికి రోడ్డు పడే వరకు నేను పెళ్లి చేసుకోను’ అంటూ లేఖలో స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్రదుర్గ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం రాంపుర. 40 ఇళ్లు ఉన్న ఈ ఊరికి కనీస సౌకర్యాలు కూడా లేవు. సరైన రోడ్డు లేక బస్సులు రాక.. అక్కడ చాలా మంది పిల్లల చదువులు ఆగిపోయాయి. స్కూల్​కు వెళ్లాలనుకున్నవారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.

దీంతో ఆ గ్రామానికి రాకపోకల కోసం స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంధువులు కూడా అక్కడికి రావడం మానేశారు. రోడ్డు సమస్య వల్ల ఈ ఊరి యువతులను వివాహం చేసుకునేందుకు కూడా బయటివారు మొగ్గు చూపడం లేదు.ఇక ఈ సమస్యలకు ఎలాగైనా పరిష్కారం కావాలని భావించిన బిందు.. తన గ్రామం పరిస్థితిని వివరిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాసింది. ‘మాది 40 ఇళ్లు ఉన్న ఓ చిన్న గ్రామం. ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. మా గ్రామం ఇంకా రోడ్ల సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి పరిష్కారం కోసమే నేను ముఖ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాశాను’ అంటూ యువతి బిందు పేర్కొంది. కాగా ఆమె లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం.. రాంపుర రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో సీఎం హామీపై బిందు హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement