అమరావతి,ఆంధ్రప్రభ: జూన్ నెలలో రీ- అప్పోర్షన్మెంట్, బదిలీలు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు జూన్, జూలై నెలలకు సంబంధించిన జీతాలను నాలుగు రోజుల్లోపు మంజూరు చేస్తామని ట్రెజరీ & అకౌంట్స్ విభాగం సంచాలకులు డాక్టర్ యన్. మోహన్ రావు బుధవారం ఎపిటిఎఫ్తో తెలిపారు.
ఏపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.రవీంద్ర ప్రసాద్ ఈ విషయంపై డిటిఏని కలిశారు. జూన్, జూలై నెలల జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే ప్రత్యేక పరిస్థితులుగా భావించి జీతాలను మంజూరు చేయాలని కోరారు.
సప్లమెంటరీ తేదీల గడువు లేదా రెగ్యులర్ బిల్లుల జీతాల గడువు తో నిమిత్తం లేకుండా ఎలాగైనా ఈ జీతాలు చెల్లించాలని అభ్యర్దించారు. ఆ మేరకు సంచాలకులు ఆ నిబంధనల మేరకు కాకుండా ప్రత్యేక పరిస్థితులుగానే భావించి ప్రభుత్వం నాలుగు రోజుల లోపల (20 ఆగస్టు నాటికి) జూన్, జూలై నెల జీతాలను మంజూరు చేయుటకు కృషి హామీనిచ్చినట్లు వారు తెలిపారు.