Wednesday, May 15, 2024

చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్ పింగ్..కొత్త ప్రధానిగా లీ కియాంగ్

ఐదేళ్లకి ఒకసారి జరిగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ మహాసభలు శనివారంతో ముగిశాయి. కాగా అందరూ అనుకున్నట్టుగానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్ పింగ్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగాను మరోసారి జిన్ పింగ్ ఎన్నికయ్యారు. జిన్ పింగ్ స్వయంగా ఆదివారం దీనిపై ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ప్రధానిగా ఉన్న లీ కెకియాంగ్ కు జిన్ పింగ్ ఉద్వాసన పలకడం తెలిసిందే. ఆ స్థానంలో తన అనుచరుడైన లీ కియాంగ్ ను నూతన ప్రధానిగా జిన్ పింగ్ ప్రకటించారు. లీ కియాంగ్ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ షాంఘై విభాగం కార్యదర్శిగా పనిచేశారు. ఏడుగురు సభ్యుల పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీని సైతం జిన్ పింగ్ ప్రకటించారు. ఇందులో జిన్ పింగ్, కొత్త ప్రధాని లీ కియాంగ్ తోపాటు, ఝూవో లిజి, వాంగ్ హూనింగ్ తదితరులు ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాలన వ్యవహారాలు, దేశ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీయే నిర్ధేశిస్తుంటుంది. ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి సాధించలేదని జిన్ పింగ్ పేర్కొన్నారు. అలాగే, ప్రపంచానికి చైనా అవసరమన్నారు. పార్టీని అత్యున్నత స్థానంలోకి తీసుకెళ్లామని, భవిష్యత్తులోనూ మరింత సమష్టిగా నడిపిస్తామని ప్రకటించారు. వివిధ దేశాల అధినేతలు అభినందనలు తెలియజేస్తున్నారంటూ, వారికి ధన్యవాదాలు ప్రకటించారు. తన టీమ్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, చైనాను ఆధునిక సోషలిస్ట్ దేశంగా ముందుకు తీసుకెళతానని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement