Tuesday, May 7, 2024

Big Story : పత్తికి పెట్టుబడి భారం, పెరిగిన ఖర్చులు.. డీజిల్‌ ధరలతో రెండింతల ఖ‌ర్చు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన ఢీజిల్‌ ధరలతో సాగు కష్టంగా మారింది. వానాకాలం సీజన్‌ రైతుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అసలే దిగుబడుల లోటుతో అవస్థల్లో ఉన్న రైతాంగానికి పెరిగిన ధరలు గుదిబండగా మారాయి. దుక్కి దున్నాలంలే డీజిల్‌ ధర చుక్కలు చూపిస్తోంది. పత్తి విత్తనాల ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రత్యామ్నాయ పంటలపై పెను ప్రభావం పడుతోంది. యాంత్రీకరణ దిశగా ప్రభుత్వ ప్రోత్సాహం రైతులకు పెరిగిన ధరలతో దక్కకుండా పోతోంది.

విత్తనాల ఖ‌ర్చు…

పత్తి క్వింటాల్‌కు ధర రూ. 12వేలకుపైగా ఉండగా, దిగుబడి బాగుంటే భారీ లాభాలు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ధరలు ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వ పిలుపు, వరి ధాన్యం కొనుగోళ్లపై అనిశ్చితి కాస్తా రైతులను పత్తి దిశగా మళ్లిస్తోంది. అయితే పత్తి విత్తనాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పత్తి విత్తన ప్యాకెట్‌ ధర రూ. 810 ఉండగా, గత సీజన్‌లో ఇది రూ. 767గా ఉంది. ఎకరాకు మూడు ప్యాకెట్లు అవసరంకాగా, రైతులపై విత్తనాలకు అదనంగా రూ. 129 భారం పడుతోంది. 20లక్షల ఎకరాలకు ఇలా చూస్తే భారీగా అదనపు వ్యయం పడనుంది. అదేవిధంగా ఇతర ఖర్చులు కూడా భారీగా పెరిగాయి.

దుక్కి దున్నకాలు ప్రియమే…

సీజన్ల వారీగా దుక్కి దున్నేందుకు ట్రాక్టర్‌ యాజమాన్యాలు పెరిగిన డీజిల్‌ ధరల ఆధారంగా ధరలు ఖరారు చేస్తారు. రాష్ట్రంలో సొంతంగా ట్రాక్టర్లు ఉన్న కొద్దిమంది రైతులు పోగా మిగిలిన మెజార్టీ రైతులపై డీజిల్‌ భారం తడిసి మోపడవుతోంది. గంటల లెక్కన దుక్కి దున్నుతున్న ట్రాక్టర్ల యజమానులు పెరిగిన డీజిల్‌ ధరల సాకుతో అదనంగా రూ. 800వరకు ధరలను పెంచారు. గతేడాది గంటకు రూ. 1100 ఉండగా ఇప్పుడీ ధర రూ. 1800లకు పెరిగింది. పత్తి కట్టకె కొట్టేందుకు ఎకరాకు రూ. 1400, ఆఫ్‌ కేజ్‌ వీల్స్‌తో దుక్కి దున్నేందుకు గంటకు రూ. 100, ఫుల్‌ కేజీ వీల్స్‌తో గంటకు రూ. 2300లు చార్జీ వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ. 1000 భారం అదనంగా పడుతోంది.

- Advertisement -

వానాకాలం సాగు సీజన్‌పై సర్కార్‌ దృష్టిసారించింది. ఇప్పటికే ఈ దిశగా వానాకాలపు పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. జిల్లాల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, మందుల వినియోగం, అవసరాలను అంచనా వేసింది. ప్రత్యామ్నాయ పంటల విధానంలో భాగంగా పత్తి సాగును ఈ ఏడాది పెంచేలా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. పత్తి సాగును 70లక్షల ఎకరాల్లో సాగును ప్రోత్సహించేలా, వరిసాగును 45 లక్షల ఎకరాలకు పరిమితం చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రత్యామ్నాయ పంటల్లో…

వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ రైతు వ్యతిరేక విధానాల దృష్ఠ్యా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో వరి సాగును నియంత్రించాలని భావిస్తోంది. మిగతా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి ఈ దిశగా రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 42లక్షల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల పంటలు సాగయ్యేలా సర్కార్‌ ప్రణాళికలు వేసుకుంది. ఈ దఫా ప్రధానంగా పత్తి సాగుకే 75లక్షల ఎకరాలను టార్గెట్‌గా నిర్దేశించుకున్నది. ఇందుకుగానూ ఇప్పటికే ఎకరాకు రెండు ప్యాకెట్ల చొప్పున కోటి 50లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని గుర్తించింది. వీటిని సమీకరించి సిద్ధంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. అదనంగా మరో 20లక్షల ప్యాకెట్లను కూడా సేకరిస్తోంది. బిటి పత్తి విత్తనాల్లో భాగంగా దేశమంతటా 5.80కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు ఉత్పత్తి అవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనే 2.21 కోట్ల విత్తన ప్యాకెట్లు ఉత్పాదనకు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ గుర్తించింది.

50లక్షల ఎకరాల్లోపే వరిపంట…

మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఎక్కువగా సాగు కానుందనే అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా కార్యాచరణను మొదలు పెట్టింది. 50లక్షల ఎకరాల్లో వరిపంట సాగును అంచనా వేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఎంటీయూ, బిపిటి, ఆర్‌ఎన్‌ఆర్‌, వరంగల్‌, జగిత్యాల రకాలకు చెందిన వరి వంగడాలను సిద్ధం చేస్తోంది. వరి విత్తనాలను 25కిలోలకు ఒక ప్యాకెట్‌ చొప్పున రెడీ చేస్తున్నారు. అదేవిధంగా మరో ప్రత్యామ్నాయ పంటగా పేరున్న కందికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. 15లక్షల ఎకరాల్లో కంది పంట సాగును ప్రోత్సహిస్తోంది.

భారీ డిమాండ్‌ దిశలో పత్తి పంట…

గతేడాది పత్తికి డిమాండ్‌ పెరిగి ధర పెరిగింది. కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ. 6025 ఉండగా, గరిష్టంగా క్వింటాలుకు రూ. 12 వేల ధర పలికింది. 28లక్షల బేళ్ల పత్తిని రాష్ట్రంలోని జిన్నింగ్‌, ప్రెసింగ్‌ మిల్లర్లు కొనుగోలు చేయగా, 8లక్షల బేళ్ల పత్తి మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రమేయం లేకుండానే అమ్మకాలు పూర్తయ్యాయి. ఈ కారణంగా మరోసారి కూడా పత్తి పంటకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయంగా పత్తికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో పత్తి సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అయితే డీజిల్‌, ఇతర భారాలనుంచి రైతులకు ఉపశమనం లభిస్తే మరింత సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement