Sunday, April 28, 2024

అంతర్జాతీయంగా చమురు మంట, 14 ఏళ్ల గరిష్టానికి ధరలు.. బ్రెంట్‌ క్రూడాయిల్‌ 130 డాలర్లు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తరువాత కోలుకుంటున్న దేశాలకు ఈ యుద్ధం శాపంలా మారింది. ఈ యుద్ధానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. చమురు ధరలు పెరిగితే.. రవాణా ఖర్చులు పెరిగి.. ఆహారం నుంచి అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 130 డాలర్లను తాకింది. క్రితం సెషన్‌లో బ్రెంట్‌ 130 డాలర్లను కూడా క్రాస్‌ చేసింది. భారత్‌లో ప్రామాణికంగా భావించే బ్రెంట్‌ ఓ సమయంలో 139 డాలర్లను తాకి.. కిందికి వచ్చింది. ఇది 14 ఏళ్ల గరిష్టం, చివరిసారి 2008 ఈ ధరలు కనిపించాయి. దేశీయంగా పెట్రో, డీజెల్‌ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. సోమవారంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. నేటి నుంచి ఇంధన బాదుడు ప్రారంభం అవుతుంది. దీపావళి నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నాలుగు నెలల కాలంలో క్రూడాయిల్‌ ధరలు రెట్టింపు అయ్యాయి. విడతల వారీగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.140కు వరకు వెళ్లే అవకాశాలున్నాయి. కేంద్రం గతంలో మాదిరి సెస్‌ తగ్గిస్తేనే.. సామాన్యుడిపై ఇంధన భారం తగ్గుతుంది.

దెబ్బతింటున్న ఇంధన సరఫరా వ్యవస్థ..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. రష్యా నుంచి దిగుమతి అయ్యే చమురుపై నియంత్రణలు లేదు. అమెరికా, యూరప్‌ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇదే జరిగితే.. అప్పుడు ప్రపంచ చమురు అవసరాల్లో పది శాతం వాటా కలిగి ఉన్న రష్యా నుంచి సరఫరా నిలిచిపోతే.. బ్రెంట్‌ క్రూడాయిల్‌ 150 డాలర్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్‌ ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో సాధారణ గ్యాస్‌ గ్యాలెనన్‌ ధర 4 డాలర్లకు చేరుకుంది. 2008 తరువాత ఇదే అత్యధికం. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు ఆలస్యం అవుతున్నాయి. ఈ డీల్‌ కుదిరితే.. ఇరాన్‌ పైన ఆంక్షల ఎత్తివేతకు చూస్తోంది అమెరికా. అప్పుడు రష్యా స్థానాన్ని ఇరాన్‌ భర్తీ చేస్తుంది. కానీ చర్చలు కొలిక్కి రావడం లేవు. ఇలా వివిధ రకాల కారణాలు చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement