Monday, May 6, 2024

వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు.. కొవిడ్‌ టీకా 200 కోట్ల డోసులు

న్యూఢిల్లి: కోవిడ్‌ -19 నిరోధక వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 18 నెలల కాలంలో 200 కోట్ల డోసుల టీకాలను ప్రజలకు అందించింది. ప్రపంచంలో మరే దేశమూ వ్యాక్సినేషన్‌లో దరిదాపుల్లో లేదు. కోవిన్‌ వేదికగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదివారం పేర్కొన్న గణాంకాల ప్రకారం 2,00,00,92,000మందికి టీకాలు విజయవంతంగా పూర్తి చేశారు. కరోనాపై యుద్ధంలో ఇది మరో మైలురాయి. కాగా తాజా రికార్డుపై ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌లో స్పందించారు. మళ్లిd మనం చరిత్ర సృష్టించాంమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎవరితోను పోల్చి చూడటానికి అవకాశం లేని విధంగా, వేగంగా టీకాల కార్యక్రమం పూర్తి చేయడం ఘనవిజయమని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. మన్‌సఖ్‌ మాండవీయ కూడా కరోనా పోరాట యోధులు, దేశ పౌరులకు అభినందనలు తెలిపారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లతోనే సాధించిన ఈ ఘనత ప్రజలకు, సమర్థ, దార్శనిక నాయకత్వానికి దక్కుతుందని నీతిఆయోగ్‌ సభ్యుడు, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షుడు వి.కె.పాల్‌ అన్నారు. 2021 జనవరి 16న తొలిసారిగా దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత తొలి 202 రోజుల్లో తొలి 50 లక్షల డోసుల టీకాలు పూర్తి చేశారు.

రెండు, మీడో విడత 50 లక్షల టీకాలు కేవలం వరుసగా 76, 79 రోజుల్లోనే పూర్తి చేశారు. కరోనా రెండు, మూడు తరంగాల్లో ఒమిక్రాన్‌, డెల్టా రకాలు తీవ్ర ప్రభావం చూపించాయి. దాంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త నెమ్మదించింది. 150 కోట్ల నుంచి 200 కోట్ల డోసులు పూర్తి చేయడానికి 191 రోజుల సమయం పట్టడానికి ఇదే కారణం. కేంద్రం అందించిన సమాచారం ప్రకారం దేశ జనాభాలో 98 శాతం కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్నారు. కానీ ప్రపంచ జనాభాలో 62.1 శాతం మంది పూర్తి డోసులు తీసుకోగలిగారు. కాగా 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా బూస్టర్‌ ఇచ్చే కార్యక్రమం మూడురోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు 5,63,67,888 మందికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చారు. కాగా 200 కోట్ల డోసుల మైలురాయి చేరిన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జె.ఏ.జయలాల్‌ శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement