Saturday, April 27, 2024

ఇంధన భద్రతకోసం దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాలి: ఉపరాష్ట్రపతి..

దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని తద్వారా భారతదేశ ఇంధన అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శక్తి ఉత్పాదన రంగంలో ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశీయంగా చమురు ఉత్పత్తిని, పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. భారతదేశంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయన్న ఆయన, ఈ దిశగా వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి విచ్చేశారు. 2017లో పార్లమెంటులో చేసిన చట్టం ఆధారంగా జాతీయ ప్రాధాన్య సంస్థగా ఐఐపీఈని గుర్తించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్, తన అవసరాలకోసం 80 శాతం విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, దేశీయంగా చమురును వెలికితీయడం ద్వారా భారతదేశానికి ఇంధన భద్రతను అందిండచంతోపాటు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునేందుకు వీలుపడుతుందన్నారు. పెట్రో నిల్వలున్న ప్రాంతంలో చమురు వెలికితీతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం హైడ్రోకార్బన్ ఎక్స్ ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ (హెల్ప్)తో పాటు వివిధ విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తోందని గుర్తుచేశారు.

పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరుగుతోందన్న ఉపరాష్ట్రపతి, 2045 నాటికి భారతదేశం ఇంధన డిమాండ్ రేటు 3శాతం చొప్పున కన్నా ఎక్కువగా పెరుగుతుందని, అదే సమయంలో మిగిలిన దేశాల ఇంధన డిమాండ్ రేటు 1 శాతం చొప్పున కంటే తక్కువగా ఉండనుందనే విషయాన్ని గుర్తుచేశారు. ఇందుకోసం పెట్రోలియం రంగంలో నైపుణ్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధిని పెంచుకునేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించాలని, విశ్వవిద్యాలయాలు-పరిశ్రమల మధ్య అనుసంధానతను పెంచుకోవడం ద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముందుడుగేసేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పరిశోధనలు చేసేదిశగా పీహెచ్ డీ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఆయన, విద్యారంగంలోనూ వివిధ అంశాలను ఒకేసారి నేర్చుకునేందుకు వీలు కల్పించాలన్నారు. నూతన విద్యావిధానం – 2020 ఈ దిశగా బాటలు వేస్తుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో సౌర, పవన, అలల ద్వారా, వివిధ మార్గాల్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తిని చేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఐఐపీఈ వంటి విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన శిక్షణను అందించాలన్నారు. ఈ దిశగా జరుగుతున్న ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణ వ్యవస్థకు లాభం చేసిన వారమవుతామన్నారు. ఈ దిశగా ఐఐపీఈ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పెట్రోకెమికల్ రంగంలో అవసరమైన పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఐఐపీఈలోని అపారమైన అనుభవమున్న అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విస్తృతమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. ఈ దిశగా ప్రభుత్వాలు చేస్తున్న కృషికి పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, వైద్య నిపుణులు, సమాజంలోని వివిధ రంగాల ప్రతినిధులు బాధ్యతగా సహకరించాలని పేర్కొన్నారు. టీకాకరణ ద్వారానే ఒకవేళ కరోనా సోకినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చేరాల్సిన అవసరం రావని, టీకాకరణ మన ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందని, అందుకే ప్రతిఒక్కరూ బాధ్యతగా టీకాలు తీసుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

తాను ప్రారంభించిన విశ్వవిద్యాలయ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, డిగ్రీలు పొందుతున్న విద్యార్థులకు అభినందనలు, అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ సిదిరి అప్పలరాజు, ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీకే బానిక్, ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ఆర్‌కే ప్రసాద్, ఐఐపీఈతోపాటు వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement