Saturday, April 20, 2024

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఎన్ని కోట్ల నిధులైనా ఖ‌ర్చు చేస్తాం : మంత్రి త‌ల‌సాని

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్ని కోట్ల నిధులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ లతో కలిసి నియోజకవర్గ పరిధిలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, హార్టికల్చర్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 9.60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి డివిజన్ ల వారిగా ఆయా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా సుమారు 35 కోట్ల రూపాయలతో నూతన పనుల కోసం ప్రతిపాదనలను రూపొందించి నిధుల మంజూరు కోసం పంపించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 70 లక్షల రూపాయలు జీహెచ్ఎంసీ, రూ.70 లక్షలు వాటర్ వర్క్స్ శాఖల పనులకు కేటాయించినట్లు తెలిపారు.

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేని కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రధాన రహదారుల అభివృద్ధి జరుగుతుందని, అంతర్గత రహదారుల అభివృద్ధి పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన సీవరేజ్, మంచినీటి పైప్ ల వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. వాటి పరిష్కారానికి గాను నూతన పైప్ లైన్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల నూతన పైప్ లైన్ల‌ ఏర్పాటుతో సమస్యలను పరిష్కరించడం జరిగింద‌న్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలను సిద్దం చేసినట్లు చెప్పారు.

సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంటలో గల కంజర్ల లక్ష్మీనారాయణ పార్క్ కు వచ్చే వారి కోసం అన్ని వసతులను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. పార్క్ లోని నీటి కొలనులో ఫెడల్ బోట్ లను ఏర్పాటు చేయాలని డీసీ వంశీ ని ఆదేశించారు. సనత్ నగర్ డివిజన్ లో అత్యధికంగా 55 పార్క్ లు ఉన్నాయని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మోడల్ ప్రాజెక్ట్ గా చేపట్టి పార్క్ లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఎన్డీపీ సీఈ వసంత, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, ట్రాన్స్ కో ఎస్ఈ చంద్రశేఖర్, డీఈ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ఏఎంఓహెచ్ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement