Wednesday, May 1, 2024

Delhi: ఐఐటీ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌… కారణాలపై విచార‌ణ‌…

దేశంలో వ‌రుస‌గా ఐఐటీ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆందోళ‌నలను క‌లిగిస్తున్నాయి. రెప్ప‌పాటు నిర్ణ‌యాల‌తో విగ‌త‌జీవులుగా మారుతున్నారు. దీంతో వారి త‌ల్లిదండ్రుల‌కు గ‌ర్భ‌శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా ఐఐటీ ఢిల్లీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన సంజయ్‌ నెర్కర్ (24) ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నాడు. అతడు ద్రోణాచార్య హాస్టల్‌లోని రూమ్‌ నంబర్‌ 757లో ఉంటున్నాడు. గురువారం రాత్రి అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నెర్కర్ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో ఆందోళన చెంది హాస్టల్‌ సిబ్బందిని సంప్రదించారు. సిబ్బంది వెంటనే నెర్కర్‌ రూమ్‌ వద్దకు వెళ్లి చూడగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. తలుపులు ఎన్నిసార్లు కొట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. నెర్కర్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది కనిపించాడు.

దీంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement