Monday, April 29, 2024

పర్సనల్ విషయాలు లీక్ చేస్తే.. ట్రోలింగ్స్ తప్పవ్.. తమ్మారెడ్డి భరద్వాజ

సినీ నటులపై ట్రోలింగ్స్ జరగడంపై స్పందించారు తమ్మారెడ్డి భరద్వాజ. రీసెంట్ గా హీరోయిన్ రష్మిక ట్రోలర్స్ బారిన పడింది. దాంతో ట్రోలింగ్ గురించి తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. రష్మిక తనకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటుంది .. తన అభిప్రాయం చెబుతుంది. అందుకు ఆమెను తప్పుబట్టేసి ట్రోల్ చేయవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రష్మిక ఏం చేస్తే బాగుంటుందనే చెప్పే హక్కు ఇతరులకు లేదుకదా అన్నారు. సాధారణంగా ట్రోలింగ్ బారిన పడటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరైతే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ లో పెడతారో అలాంటివారే ట్రోలింగుకి గురవుతూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ‘నేను సింగిల్’ అని ఫేస్ బుక్ లో పెడుతుంటారు.

ఆమె సింగిల్ గా ఉంటే ఏంటి? .. డబుల్ గా ఉంటే ఏంటి? అసలు ఆ విషయం బయటికి చెప్పడం ఎందుకు? అనవసరమైన విషయాలను పోస్ట్ చేయడం అంటే అవతలవారిని రెచ్చగొట్టడమే కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా సరే .. ఏ విషయమైనా సరే .. పర్సనల్ విషయాలను పబ్లిక్ లోకి తీసుకురాకపోవడమే మంచిది. ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటే, ఆ వీడియో హక్కులను కూడా టీవీలకో .. డిజిటల్ వారికో అమ్మేస్తున్నారు. నిజం చెప్పాలంటే పెళ్లి అనేది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఇక హనీమూన్ మరింత పర్సనల్ విషయం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి హనీమూన్ అనేది పెట్టారు. చివరికి హనీమూన్ కి సంబంధించిన విషయాలను కూడా అమ్మేసుకుని దానిని కూడా కమర్షియల్ గా చేసేస్తున్నారు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఏం చేయాలనుకుంటున్నట్టు? మనం నోరుమూసుకుని కూర్చుంటే .. ఎదుటివారు ఏం మాట్లాడతారు? అందుకు భిన్నమైన పనులు చేస్తే ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement