Sunday, April 28, 2024

అలర్ట్.. తల్లి ద్వారా కడుపులో బిడ్డకు కరోనా వైరస్

కరోనా మహమ్మారి తల్లి నుంచి గర్భస్థ శిశువు కూడా సోకుతుందని వైద్యులు నిరూపించారు‌. హైదరాబాద్‌లోని లిటిల్‌స్టార్స్‌ పిల్లల ఆస్పత్రిలో పని చేస్తున్న డా. సతీష్.. ఇటీవలే ఇలాంటి ఓ కేసును గుర్తించడమే కాకుండా.. కరోనాతో పుట్టిన పసిబిడ్డకు విజయవంతంగా చికిత్స అందించారు. ఇలా తల్లి ద్వారా బిడ్డకు వ్యాధి వ్యాపించడాన్ని కోవిడ్‌ 19 నియోనాటల్‌ మిస్‌–సి అని పిలుస్తారని ఆయన తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఈ వ్యాధి తల్లి నుంచి గర్భంలో ఉన్న బిడ్డకు సోకే అవకాశం లేదు. కానీ గతేడాదిగా కోవిడ్‌తో బాధపడుతున్న గర్భిణులకు వైద్య సాయం అందిస్తున్న డాక్టర్‌ ఘంటా సతీష్ మాత్రం ఈ అంశంతో ఏకీభవించలేదు. పుట్టిన బిడ్డల్లో కోవిడ్‌ లక్షణాలు ఉన్నా.. శరీరంలో యాంటీబాడీలు లేకపోవడాన్ని కొందరిలో గుర్తించారు. కొంతకాలం కింద కొంచెం అటు ఇటుగా జరిగిన నాలుగు కాన్పులతో ఈ అంశంపై ఆయన కొంత స్పష్టత సాధించగలిగారు. పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకరు పూర్తిగా నెలలు నిండిన తర్వాత బయటికి రాగా.. మిగిలిన వారిని 32 వారాల్లోపే బయటకు తీశారు. నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలో మాత్రమే యాంటీబాడీలు ఉండటాన్ని గుర్తించిన సతీష్‌.. ఇది కచ్చితంగా తల్లి నుంచి గర్భంలోని బిడ్డకు వైరస్‌ సోకడం వల్ల మాత్రమే సాధ్యమైందన్న నిర్ధారణకు వచ్చారు. మిగిలిన ముగ్గురు బిడ్డల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ‘గర్భస్థ శిశువులకు తల్లి నుంచి ఉమ్మ నీరు దాటుకుని మరీ యాంటీబాడీలు చేరాలంటే కనీసం 32 వారాలు పూర్తయి ఉండాలి. నలుగురు పిల్లల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు 32 వారాలు పూర్తి కాకముందే పుట్టగా.. మిగిలిన ఇద్దరు 28, 31 వారాల తర్వాత పుట్టిన వారు’అని వైద్యుడు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement