Wednesday, May 1, 2024

ఏపీ, తెలంగాణ‌లో హై టెంప‌రేచ‌ర్స్‌.. 49 డిగ్రీలు దాటిన ఎండ‌లు

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో మాడు పగిలేలా ఎండ‌లు దంచికొడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అసలిది వేసవికాలమేనా అనిపించేలా వర్షాలు కురవగా.. ఇప్పుడు ఇంట్లోంచి కాలు బ‌య‌ట పెట్టాలంటే ఒల్లు జ‌ల్లుమ‌నేలా ఎండలు భయపెడుతున్నాయి. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాజ‌మండ్రిలో 49 డిగ్రీల హై టెంప‌రేచ‌ర్ న‌మోదు అయ్యింది.

ఇక చాలా జిల్లాల్లో 47, 46, 45 డిగ్రీల దాకా అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. దీంతోపాటు వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే.. తాజాగా భారత వాతావరణ విభాగం.. నైరుతి రుతుపవనాల గురించి ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది.

సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యంగా.. జూన్ 4 నాటికి కేరళలోకి వచ్చే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతం అందిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

భారత్ లోకి రుతుపవనాలు ప్రవేశించాక ఎంత వేగంగా విస్తరిస్తే అంత వర్షపాతం ఉంటుందని, ఆలస్యంగా విస్తరిస్తే వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐఎండీ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది దేశంలో 96 శాతం వర్షపాతం నమోదుకానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నైరుతి రుతుపవనాలు వచ్చేంత వరకూ ఈ మండుటెండలు తప్పేలా లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement