Monday, April 29, 2024

నాగార్జునసాగ‌ర్‌, శ్రీ‌రాంసాగ‌ర్ ప్రాజెక్టుల‌కు భారీ వ‌ర‌ద‌.. గేట్లు ఎత్తివేత‌…

తెలంగాణలో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. వాన‌లు దంచికొడుతుండ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్ప‌టిక‌ప్పుడు ప్రాజెక్టులోని నీటిమ‌ట్టాన్ని సంద‌ర్శిస్తూ ఎలాంటి ప్ర‌మాదాలు చోటుచేసుకోకుండా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చూస్తూ దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొన‌సాగుతుండ‌డంతో అధికారులు ప్రాజెక్ట్ 22 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 4,42,323 క్యూసెక్కులు కాగా, ఔట్‎ఫ్లో 3,93,776క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 588.80 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 308.4658 టీఎంసీలుగా కొనసాగుతోంది.

అదేవిధంగా శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 66 వేల క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 1,090 అడుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement