Sunday, April 28, 2024

చిక్కుల్లేకుండా వేతనాలు.. ట్రెజరీ శాఖలో ఆన్‌లైన్‌ విధానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారీగా పెరుగుతూ వస్తున్న ఉద్యోగుల వేతన భారాన్ని సర్కార్‌ పక్కాగా ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు వేతనాల చెల్లింపుల్లో నెలకొన్న జాప్యాన్ని నివారించేందుకు సరికొత్త విధానాలను ముందుకు తెస్తోంది. ఎప్పటికప్పుడే ఉద్యోగుల వేతనాలకు సరిపడా నిధులను ట్రెజరీలో సెిద్దం చేసి పెడుతున్న ఆర్ధిక శాఖ ఎటువంటి జాప్యం లేకుండా చెల్లింపులకు సరళతర విధానాలకు శ్రీకారం చుడుతోంది. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ ఉద్యోగులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. అదేవిధంగా ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్కవారా ఎంప్లాయి పే స్లిప్‌లను నేరుగా క్షణాల్లో పొందేందుకు వీలును కల్పించింది. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ద్వారా ఈ సౌలభ్యం తీసుకొచ్చింది.

ఇందులో వేతనం, ప్రభుత్వ అలవెన్సులను అందుబాటులో పెట్టింది. ఇప్పటికే డీఏ 2.73శాతం పెంచిన ప్రభుత్వం త్వరలో పీఆర్సీ పెంపుకు సిద్దంగా ఉన్నది. తద్వారా రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88లక్షల మంది పెన్షనర్లకు భారీ లబ్ది చేకూరుతున్నది. 32 శాఖల్లో గెజిటెడ్‌ ఉద్యోగులు 30,403మంది, నాన్‌ గెజిటెడ్‌ 2.46.608మంది. క్లాస్‌-4 ఉద్యోగులు 30వేల మందితోపాటు ఇతర ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు త్వరలో తీపి కబురు అందనుండగా, వేతనాల సమస్యలలో పారదర్శకత రానుంది.

- Advertisement -

నేరుగా ఉద్యోగి ఖాతాకే…

నెల మొదటి పనిదినంనాడే రిజర్వ్‌బ్యాంకు ద్వారా ఉద్యోగులకు నేరుగా వారి ఖాతాల్లో వేతనాలను జమ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో ముందడుగేసింది. వేతనాల చెల్లింపుల్లో మరింత సరళ విధానాలను అవలంభిస్తోంది. గతంలో ఉన్న అనేక అవరోధాలను అధిగమించేందుకు ఆధునిక పారదర్శక విధానాలను అందుబాటులోకి తెస్తూ ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కార్‌గా తెలంగాణ ప్రభుత్వం ఖ్యాతిగడిస్తోంది. ఈ మేరకు ఖజానా శాఖ కాగిత రహిత సేవలను ఆమలులోకి తేవడంద్వారా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

ఇందుకోసం ఐఎఫ్‌ఎంఐఎన్‌ పోర్టల్‌ను అందుబాటులో తెచ్చింది. ఇందులో శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేశారు. ఈ ప్రక్రియతో బిల్లుల సమర్పణ, చెల్లింపులవంటి అన్ని వివరాలు ఉండనున్నాయి. జిల్లాల్లో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన కాగిత బిల్లులను కార్యాలయాల్లో అందజేస్తేనే ఈ కుబేర్‌ విధానంలో వేతనాలను ప్రతీనెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయి. అయితే ఇప్పుడు తీసుకొస్తున్న నూతన పోర్టల్‌తో కాగిత రహిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కాగిత బిల్లుల అంశం పూర్తిగా కనుమరుగైంది.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాన్ని ఈ కుబేర్‌తో పూర్తిగా మార్చివేసిన ప్రభుత్వం తాజాగా ఈ విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకొస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఐఎఫ్‌ఎంఐఎస్‌)ద్వారా ప్రతీ శాఖకు ప్రత్యేకంగా యూజర్‌నేం, పాస్‌ వర్డ్‌ ఇస్తారు. ఈ యూజర్‌నేమ్‌తో లాగిన్‌ అయ్యాక పూర్తి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఉద్యోగి పూర్తిపేరు, తొలి పోస్టింగ్‌, డిపార్ట్‌మెంట్‌, గతంలో ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు, పదోన్నతుల వివరాలు, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం, ప్రాంతం వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి సమగ్ర సమాచారంతోపాటు పాన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలను పొందుపర్చాల్సి ఉంటుందని ఖజానా శాఖ వెల్లడించింది. పూర్తిచేసిన మొత్తం వివరాలను ఆన్‌లైన్‌ద్వారా డీటివో(జిల్లా ట్రెజరీ అధికారి)కి అందించాలి. డీటివో మొత్తం సమాచారాన్ని పరిశీలించి ఆన్‌లైన్‌లో వేతనాలకు ఈ కుబేర్‌కు పంపిస్తారు.

ఇకమీదట రాష్ట్రంలోని 4 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాగిత బిల్లులతో పనిలేకుండా పోనున్నది. కొత్త పోర్టల్‌ అందుబాటుతో జిల్లాల్లో ఖజానా కార్యాలయాలకు పూర్తిగా పేపర్‌లెస్‌ పాలన అందుబాటులోకి రానున్నది. ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్‌ అధికారులకు కొత్త పోర్టల్‌ లాగిన్‌ సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్‌లో ఉద్యోగుల వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నెలలోనే పూర్తిస్థాయిలో మొత్తం ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను నమోదు చేసి వచ్చే నెలనుంచి పేపర్‌లెస్‌ బిల్లులద్వారా ఆన్‌లైన్‌ వేతనాల అందజేతకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న ఇంపాక్ట్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలు కనుమరుగు కానున్నాయి. హార్డ్‌ కాపీల అందజేత, ఖజానా కార్యాలయంలో బిల్లుల ఆమోదం వంటి ఇబ్బందులు తొలగనున్నాయి.

గతేడాదిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా నేరుగా వేతనాలు ఖాతాలో జమ చేస్తున్నారు. ఎస్‌బీఐ ద్వారా వేతనాలను చెల్లింపులను ఈ కుబేర్‌ రాక తర్వాత పూర్తిగా నిలిపివేసింది. ఈ విధానానికి పూర్వం డీడీవోలు ట్రెజరీలో సమర్పించిన బిల్లులను ట్రెజరీ అధికారులు ఆడిట్‌ చేసి బ్యాంకుకు పంపేవారు. బిల్లులు బ్యాంకుకు చేరాయా లేదా అనే అంశం డీడీవోలు పరిశీలించి బ్యాంకుకు వెళ్లి నిర్దారణ చేసుకునేవారు. ట్రెజరీ అధికారులు ఇచ్చిన టోకెన్‌ను బ్యాంకులో సమర్పించాకే వేతనాలు ఖాతాల్లో జమ అయ్యేవి. తాజా సంస్కరణలు అమలులోకి రావడంతో డీడీవోలు, ట్రెజరీలో బిల్లులు సమర్పిస్తున్నారు. ట్రెజరీ అధికారులు వాటిని ఆడిట్‌ చేసి నేరుగా ఆర్‌బీఐకి పంపిస్తున్నారు. దీంతో బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పిపోయింది. డబుల్‌ ఆథరైజేషన్‌ ఒకేసారి చేయడంతో నెలలో మొదటి పనిదినంనాడే ఉద్యోగుల వేతనాలు క్రెడిట్‌ అవనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement