Saturday, April 27, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎంఎం కీరవాణి

హైదరాబాద్ : మనిషికి మొదటి గురువు నేలతల్లి అయితే రెండవ గురువు చెట్టు అని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అన్నారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుందంటూ.. మొక్కల ప్రాధాన్యతను వివరించి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను సంగీతమయం చేశారు కీరవాణి. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో ఈ రోజు కీరవాణి తన బృందంతో సింగర్స్ అరుణ్ కౌండిన్య, అమల చేబోలు, మోహన బోగరాజు, హైమత్ మొహమ్మద్, గోమతి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం కీరవాణి మాట్లాడుతూ.. మనం మనుషులతోనే మాట్లాడతాం, మనుషుల‌నే జీవులుగా పరిగణిస్తాం.. కానీ మొక్కలు మనకన్న గొప్పవి.. ఏ స్వార్థం లేకుండా మన బ్రతకడానికి కావాల్సిన ఆక్సీజన్ ను అందిస్తాయ‌న్నారు. మనం బ్రతకాలంటే చెట్లు కావాలి.. చెట్లు కావాలంటే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యులు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు తన సహచరులు మణిశర్మ, సింగర్ సునితకు ఛాలెంజ్ విసురుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీరవాణితో పాటు ఆరుగురు సభ్యుల బృందం మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement