Tuesday, May 7, 2024

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. పదవీ విరమణ వయసు నిర్ధేశించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గతంలో ఉన్న అతితక్కువ వేతనాలను సవరించి సంతృప్తికరంగా నిధులు నిర్వర్తించే స్థాయికి అంగన్‌వాడీ ఉద్యోగుల జీతభత్యాలను పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తాజాగా శ్రావన శుక్రవారం రోజున మరో శుభవార్తను తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసును నిర్ధేశించారు. అలాగే 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద రూ.లక్ష చొప్పున, మినీ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50వేల చొప్పున భృతిని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు సార్లు అంగన్‌వాడీల వేతనాల పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రతను కల్పించారు. సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలేమీ లేవని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. విశాల దృక్పథంతో వారికి 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, లక్ష రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కల్పిచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నారు. ఇటీవలే మంత్రి సత్యవతి రాథోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు. సమస్యల పట్ల తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తూ జీవో విడుదల చేసారని మంత్రి పేర్కొన్నారు.

వారి ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్‌ సర్కారే..

గత ప్రభుత్వాల హయాంలో మరుగునపడిన అంగన్‌వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో కూడా పెట్టారని తెలిపారు. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్‌వాడీలను అంతే గౌరవంగా చూస్తూ మనం వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తూ.. మహిళ గర్భం దాల్చినప్పట నుంచి ప్రసవించిన తర్వాత కూడా వారి సంక్షేమం కోసం తల్లి, తండ్రి వలె చేయూతను అందిస్తున్నామన్నారు.

కేంద్రం వాటా తగ్గించినా సంక్షేమం ఆగలేదు..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని మంత్రి గుర్తు చేశారు. మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటు-న్నదని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్‌వాడీ టీ-చర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్‌ ఔదార్యానికి, అంగన్‌వాడీ ఉద్యోగులపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement